సిరాజ్, నిఖత్ జరీన్లకు డీఎస్పీ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, కొత్త రేషన్ కార్డులు: టీ కేబినెట్ నిర్ణయాలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై మంత్రివర్గంలో చర్చించారు. 6 గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలోని అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో 2 రోజుల క్రితం ప్రకటించారు. ఈ మేరకు రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.

కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనుల పూర్తి చేయడానికి రూ. 437 కోట్లు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పక నెరవేరుస్తామన్నారు.
క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, సిరాజ్కు ఒక్కొక్కరికీ 600 గజాల చొప్పున హైదరాబాద్లో ఇంటి స్థలం, మరోవైపు, భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్లకు గ్రూప్-1 (డీఎస్పీ) ఉద్యోగాలిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విధుల్లో చనిపోయిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం, మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.
ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్కు మళ్లీ ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కోదండరాం రెడ్డి, అమీర్ ఖాన్ పేర్లను మరోసారి గవర్నర్కు పంపిస్తామన్నారు. నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు, హైదరాబాద్లో మూసీ సుందరీకరణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తామని మంత్రి తెలిపారు. జాబ్ క్యాలెండర్ జారీ చేయాలని నిర్ణయించారు. ధరణి పోర్టల్ పేరును భూమాతగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వయనాడ్ మృతులకు తెలంగాణ కేబినెట్ సంతాపం
కేరళలో వయనాడ్లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది.












Click it and Unblock the Notifications