ఎంత అదృష్టవంతులో వీళ్లు.. రిజిస్టర్లో సంతకాలు పెట్టినందుకే జీతాలు..
మొత్తం మీద ఉద్యోగుల విభజన జరగని కారణంగా.. ఏపీకి చెందిన 1250మంది ఇంజనీర్లకు తెలంగాణ సర్కారే జీతభత్యాలు భరిస్తోంది.
ఖమ్మం: పొద్దంతా ఖాళీగా కూర్చొని.. కేవలం రిజిస్టర్ లో సంతకాలు పెట్టినందుకే నెలనెలా జీతాలు తీసుకునే అదృష్టం ఎవరికి దక్కుతుంది? కేటీపీఎస్ లో పనిచేస్తున్న కొంతమంది ఇంజనీర్లకు మాత్రం కొన్ని నెలలుగా ఈ అదృష్టం కలిసొస్తోంది.
రాష్ట్ర విభజన జరిగి.. రెండున్నరేళ్లు గడిచినా.. ఖమ్మం కేటీపీఎస్ ఉద్యోగుల విభజన మాత్రం ఇంకా జరగలేదు. దీంతో ఏపీ ఇంజనీర్లను ఖాళీగా కూర్చోబెట్టి తెలంగాణ సర్కార్ జీతాలిస్తోంది. ఉదయం, సాయంత్రం అటెండెన్స్ రిజిష్టర్ లో సంతకాలు పెట్టడం.. ఆపై పొద్దంతా ఖాళీగా కూర్చోవడమే వీరి పని.
ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులు చర్చలు జరపకపోవడం.. అసలు దీనిపై అంతగా ఫోకస్ చేయకపోతుండటంతో.. ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది.
మొత్తం మీద ఉద్యోగుల విభజన జరగని కారణంగా.. ఏపీకి చెందిన 1250మంది ఇంజనీర్లకు తెలంగాణ సర్కారే జీతభత్యాలు భరిస్తోంది. దీంతో తెలంగాణ ఖజానాపై సుమారు 20కోట్ల భారం పడుతున్నట్టు అంచనా. మరోవైపు స్థానికేతర ఇంజనీర్లను ఇక్కడినుంచి పంపించేయాలని కేటీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
దీంతో ఆంధ్రా ఇంజనీర్లను తెలంగాణ జెన్ కో పక్కనబెట్టింది. ఆపై వారు సుప్రీంను ఆశ్రయించడంతో.. ఉద్యోగుల విభజన పూర్తయ్యేవరకు తెలంగాణ ప్రభుత్వమే వారికి వేతనాలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో వారి వేతన భారాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది.
కాగా, ఉద్యోగుల విభజన పూర్తయితే కొత్త ఉద్యోగాలకు అవకాశం ఏర్పడటంతో పాటు.. ప్రభుత్వంపై భారం తగ్గే అవకాశం ఉంది.