ప్రధానిని ప్రశ్నిస్తూ బ్యానర్లు - పీఎం షెడ్యూల్ లో మార్పు : 17 ప్రాంతాల్లో..!!
ప్రధాని మోదీ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ లో మార్పు జరిగింది. ఆయన నిర్దేశించిన సమయం కంటే పది నిమిషాలు ముందుగానే బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడ దాదాపు 20 నిమిషాలు పార్టీ నేతలకు సమయం కేటాయించారు. అక్కడ నుంచి ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ ఆయన ప్రయాణించే మార్గాల్లో స్వాగత తోరణాలు.. బ్యానర్లు ఏర్పాటు చేసారు.
అయితే, అదే సమయంలో ప్రధాని రాక సందర్భంగా 17 చోట్ల ఆయనకు ప్రశ్నలు సంధిస్తూ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఎవరు ఆ బ్యానర్లు ఏర్పాటు చేసింది అందులో పేర్కొనలేదు. కానీ, తెలంగాణకు హామీ ఇచ్చిన అంశాలనే ప్రశ్నిస్తూ బ్యానర్ల రూపంలో ప్రదర్శించారు. అందులో నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. మెడికల్ కాలేజీలు.. హైదరాబాద్ వరద నష్టంకు సాయం ఏదీ ..ఇలా 17 ప్రశ్నలతో ఈ బ్యానర్లు ఏర్పాటు చేసారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ఇవి దర్శనమిచ్చాయి. ఇక, ప్రధాని హైదరాబాద్ కు వస్తున్న సమయంలోనే..ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరు పర్యటనకు వెళ్లారు,
బేగంపేట నుంచి సీఎం బెంగుళూరు వెళ్లటం..అక్కడికే ప్రధాని లాండ్ కానుండటంతో ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ - బీజేపీ శ్రేణుల సందడి కనిపిస్తోంది. గతంలో ప్రధాని హైదరాబాద్ వచ్చిన సమయంలోనూ సీఎం కేసీఆర్ ప్రధానితో కలవలేదు. ఇక, ఇప్పుడు బెంగుళూరు వెళ్తున్న కేసీఆర్..అక్కడ మాజీ ప్రధాని దేవ గౌడతో పాటుగా మాజీ సీఎం కుమార స్వామితోనూ సమావేశం కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికలతో పాటుగా జాతీయ రాజకీయాల పైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక, ప్రధాని సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ లోనే ఉంటారు. 4.15 గంటలకు హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తారు. ప్రధానికి బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు వీడ్కోలు పలికే బాధ్యతలు అప్పగించారు.