గులాబీ పోయి కాషాయ కండువా వచ్చె: బీజేపీలో ఈటల, మాజీ డీఎస్పీ నళిని: జేపీ నడ్డా గైర్హాజర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్ పార్టీ ఫిరాయింపు ప్రక్రియ పూర్తయింది. తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. దేశ రాజధానిలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. తెలంగాణలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈటల రాజేందర్ చెప్పారు.
Recommended Video
L Ramana: చంద్రబాబుకు బిగ్ షాక్: ఎన్టీఆర్ను చూసే టీడీపీలోకి: టీఆర్ఎస్కు ఒక ప్లస్
బీజేపీలో చేరిన పలువురు నేతలు..
ఈటల రాజేందర్తో పాటు మెదక్ మాజీ డీఎస్పీ దోమకొండ నళిని, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ మాజీ నాయకుడు అశ్వత్థామ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, తుల ఉమ.. కాషాయ తీర్థాన్ని పుచ్చుకున్న వారిలో ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి, ఇన్ఛార్జ్ తరుణ్ ఛుగ్, బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వ కార్డులను అందజేశారు.
హుజూరాబాద్ గెలుపుతో బీజేపీ జైత్రయాత్ర..
ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన నాయకుడిగా, ఆర్థికం, వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల.. బీజేపీలో చేరడం హర్షణీయమని, తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. బీసీ నేతగా ఈటలకు తెలంగాణ రాజకీయాలపై గట్టి పట్టు ఉందని పేర్కొన్నారు. ఈటల మాట్లాడుతూ- తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి శ్రమిస్తామని అన్నారు. సర్వ శక్తులు ఒడ్డుతామని స్పష్టం చేశారు. హుజూరాబాద్లో బీజేపీ గెలుపుతో పార్టీ జైత్రయాత్రకు శ్రీకారం చుడతామని చెప్పారు.
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. ఈటల రాజేందర్ చేరిక.. తమ పార్టీని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో పరిపాలన సాగిస్తోందని, దీనికి అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. నియంత పరిపాలనకు అంతం పలికే శక్తి బీజేపీకే ఉందని అన్నారు. వెనుకబడిన వర్గాలను కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అణచి వేస్తోందో.. దానికి ఈటల రాజేందర్ ఉదంతమే ఉదాహరణ అని చెప్పారు. దీన్ని ఎదుర్కొనడానికి ఈటల కాషాయ జెండాను అందుకున్నారని, తప్పకుండా లక్ష్యాన్ని అందుకుంటారని బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం..
తెలంగాణను పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన చెప్పారు. కేసీఆర్ దురాగతాలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం తమకు మాత్రమే ఉందని, అందరం కలిసికట్టుగా కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో పోరాడతామని అన్నారు. ఉద్యమకారులు, సాధారణ ప్రజలు కోరుకున్న తెలంగాణను నిర్మిస్తామని, ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉండే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. కేసీఆర్ పాలనకు విసిగిపోయిన ప్రజాస్వామ్యవాదులు బీజేపీలో చేరుతారని అన్నారు.