ఈడీ దూకుడు.. మంత్రి పీఏ విచారణ
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్ ను ఈడీ అధికారులు 7 గంటలపాటు విచారించారు. క్యాసినో కేసులో విచారణకు రావాలంటూ ఈనెల 18వ తేదీన నోటీసులు జారీచేశారు. హరీష్ కు చెందిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. ఇదే కేసులో తలసాని సోదరులు ధర్మేంద్ర యాదవ్, మహేష్ యాదవ్ కూడా హాజరైన సంగతి తెలిసిందే.
సుమారు 130 మంది జాబితాను క్యాసినో కేసులో ఈడీ అధికారులు తయారు చేశారు. జాబితా ప్రకారం విచారణ సాగుతోంది. ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు సుదీర్ఘంగా హరీష్ ను విచారించారు. క్యాసినో ఆడటానికి వెళ్లినప్పుడు నగదు లావాదేవీలు ఎవరు చేశారు? ఎలా చేశారు? చీకోటి ప్రవీణ్ తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? తదితర వివరాలను తెలుసుకున్నారు. క్యాసినో కేసులో చీకోటిని ఆగస్టు నెలలో చీకోటిని విచారించారు. అతని బ్యాంకు లావాదేవీలపై సమాచారం సేకరించారు.
ఈనెల 18న విచారణకు హాజరైన ఎల్.రమణ అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఇదే కేసులో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కూడా రెండురోజులపాటు విచారించారు. గోవాతోపాటు విదేశాలకు వెళ్లి క్యాసినో ఎవరెవరు ఆడారనే అనుమానం ఉన్నవారందరినీ ఈడీ అధికారులకు విచారణకు పిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్ లు మూసేశారు. దీంతో పేకాటపై ఆసక్తి ఉన్నవారంతా చీకోటి ప్రవీణ్ నిర్వహించే కేసినోలలో పాల్గొన్నారని ఈడీ అనుమానిస్తోంది.