గంగుల కమలాకర్ కు ఈడీ షాక్ .. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో బండి సంజయ్ దెబ్బ
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ నాయకుడు, మంత్రి గంగుల కమలాకర్ కు ఈడి షాక్ ఇచ్చింది. మంత్రి గంగుల కమలాకర్ కు సంబంధించిన గ్రానైట్ కంపెనీలతో పాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న 8 ఏజెన్సీలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. గతంలో బండి సంజయ్ కరీంనగర్ గ్రానైట్ క్వారీల నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో, ప్రస్తుతం ఈడీ నోటీసులు ఇచ్చారు.

కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీల అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు చేసిన బండి సంజయ్
కేంద్రంలోని బిజెపి సర్కార్ హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జిల్లా మంత్రిని అదును చూసి దెబ్బ కొట్టిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గంగుల కమలాకర్ కు సంబంధించిన శ్వేత ఏజెన్సీ తో పాటుగా, మరో ఎనిమిది ఏజెన్సీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తక్కువ పరిమాణం చూపి ఎక్కువ మోతాదులో గ్రానైట్ ఎగుమతి చేసినట్లు బండి సంజయ్ కేంద్రానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ఈడీకి న్యాయవాదులు బేతి మహేందర్ రెడ్డి, గంగాధర్ కూడా ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో విదేశాలకు కూడా ఏ మేరకు ఎగుమతి చేశారో చెప్పాలని ఈడీ నోటీసులు స్పష్టం చేసింది.

గంగుల కమలాకర్ గ్రానైట్ కంపెనీతో పాటు మరో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు
కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ కంపెనీలు గనుల శాఖ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కువ గ్రానైట్ ను విదేశాలకు సరఫరా చేస్తున్నట్లు గా గుర్తించిన ఈడీ పూర్తి వివరాలు ఇవ్వాలని గ్రానైట్ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న కంపెనీల వివరాలు చూస్తే శ్వేత ఏజెన్సీ, ఏ ఎస్ షిప్పింగ్, జేఎం బ్యాక్సీ, మైధిలి ఆదిత్య ట్రాన్స్ పోర్ట్ , అరవింద్ గ్రానైట్, శాండియా ఏజెన్సీస్, పి.ఎస్.ఆర్ ఏజెన్సీస్, కె.వి.ఏ ఎనర్జీ, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ లాజిస్టిక్ ఉన్నాయి. ఇక ఈడికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని విచారణ కూడా జరిపారు.

క్షేత్ర స్థాయిలో విజిలెన్స్ తనిఖీలు .. అక్రమాలు వెలుగులోకి
కాకినాడ, కృష్ణపట్నం, వైజాగ్, చెన్నై పోర్ట్ ల వద్దకు వెళ్లి విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మైనింగ్ డిపార్ట్మెంట్ రికార్డుల్లో చూపించిన వాటికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి పొంతన లేదని గ్రానైట్ ఎగుమతుల వివరాలను ఖచ్చితంగా చూపాలని ఈడీ కరీంనగర్లోని గ్రానైట్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు సీనరేజ్ ఫీజు చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారని కేసులు కూడా నమోదు చేసింది. అయితే అప్పుడు సీనరేజ్ ఫీజును 125 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. అదికూడా చెల్లించకపోవడంతో సీనరేజి ఫీజుకు ఐదుకు ఐదు రెట్లు అపరాధ రుసుం చెల్లించాలని మొత్తం 749 కోట్లకు పైగా వ్యాపారులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు.
Recommended Video

ఈడీతో పాటు సీబీఐ కి ఫిర్యాదు .. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో మంత్రికి షాక్
ఈ ఆదేశాలపై మైనింగ్ చట్టం ప్రకారం అప్పిలేట్ అధికారికి విన్నవించుకోగా సీనరేజ్ ఫీజును కేవలం 1+1 ఇంకా చెల్లిస్తే సరిపోతుందని జీవో జారీ చేశారు. ఇక తాజాగా మే 29 న ఈ వ్యవహారంలో కీలక నివేదిక ఇచ్చినట్టు సమాచారం .ఇప్పుడు తాజాగా మరోమారు కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీల అక్రమాలపై ఈడీతో పాటుగా సీబీఐకి కూడా ఫిర్యాదులు వెళ్లినట్టు ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో, సిబిఐ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక ముంగిట జిల్లా మంత్రి, కరీంనగర్లో మైనింగ్ వెనక ఉన్న కీలక నేత గంగుల కమలాకర్ కు తాజా పరిణామాలు కాస్త ఇబ్బందిని కలిగించేలా ఉన్నాయి.












Click it and Unblock the Notifications