బీసీల్లో కాపులు: చంద్రబాబుపై టి. టీడిపీ ఎమ్మెల్యే ఫైట్
హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి విచిత్రంగా తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడి నుంచే వ్యతిరేకత ఎదరువుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ టిడిపి శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య వ్యతిరేకించారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు కూడా అయిన ఆర్. కృష్ణయ్య ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనసభకు ఎన్నికయ్యారు. కాపులను బీసీల్లో చేర్చాలనే నిర్ణయంపై చంద్రబాబు పునరాలోచన చేయాలని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో కోరారు.
కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీ వర్గాలు నష్టపోతాయని ఆయన అన్నారు. కాపులను బీసీ సామాజిక వర్గంలో కలిపే అంశానికి తాను పూర్తిగా వ్యతిరేకమని ఆయన చెప్పారు .
చంద్రబాబుపై బీసీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. త్వరలో బీసీ సంఘాల నాయకులతో విజయవాడలో తాను సమావేశం నిర్వహిస్తానని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో ఆర్. కృష్ణయ్యను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎల్బీ నగర్ నుంచి చంద్రబాబు పోటీకి దించారు.
అనూహ్యంగా ఆయన విజయం సాధించారు. అయితే, ఆయన తెలంగాణ టిడిపికి కూడా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. తెలంగాణ టిడిపి నాయకులు కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. మానసికంగా ఆర్. కృష్ణయ్య టిడిపికి దూరమయ్యారు. టిడిపి కార్యకలాపాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు.