తెలంగాణలో ముందస్తుపై తేల్చేసిన ఈసీ!: అభ్యర్థులతో కేసీఆర్ రెడీ, 8న బాబుతో టీడీపీ భేటీ
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. అఖిల పక్ష నేతలతో సచివాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. ముందస్తు ఎన్నికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
కేవలం ఊహాగానాలే వినిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా తాము నడుచుకుంటామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియని తాము కొనసాగిస్తున్నామన్నారు.
'25 లక్షలు అంటే 5 లక్షలు రాలేదు, కేసీఆర్! చంద్రబాబు వల్లేనని మరవొద్దు'
అందుకే సమావేశమయ్యాం
అందులో భాగంగానే తాము ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని రజత్ కుమార్ తెలిపారు. రాష్ట్రానికి 84వేలకు పైగా వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లు, లక్షా ఇరవై మూడు వేల బ్యాలెట్ యూనిట్లు అవసరమని చెప్పారు. ఈసీఐఎల్లో అవి సిద్ధమవుతాయని తెలిపారు. ఓటర్ల జాబితా ముసాయిదాపై మాత్రమే చర్చలు జరగాలన్నారు. ఇది సాధారణ సమావేశమే అన్నారు. ఒకవేళ తెరాస ముందస్తుకు పిలిచినా తాము సిద్ధమే అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్నేత మర్రి శశిధర్రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతోందని, కాంగ్రెస్ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని చెప్పారు. అక్రమ ఓటర్లను తొలగించాలని ఈసీని కోరామన్నారు. ఆదిలాబాద్ జిల్లా దంతాలపల్లిలో టీఆర్ఎస్ మద్దతుదారులు కాకుండా మిగిలిన వారి ఓట్లు తొలగించారన్నారు.
ప్రగతి భవన్ చేరుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పాం హౌస్ నుంచి బుధవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ చేరుకున్నారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తదితర అధికారులతో భేటీ అయ్యారు. రేపు (గురువారం) కేబినెట్ భేటీ జరగనుంది. అందరూ అందుబాటులో ఉండాలని మంత్రులను ఆదేశించారు. కాగా, హుస్నాబాద్ సభావేదిక నుంచి 15 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
సభ రద్దయితే.. గవర్నర్ ఆమోదం
సభ రద్దయితే నిర్ణయాలు అన్నీ గవర్నర్వే ఉంటాయని ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ చెబుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి కొనసాగుతుందన్నారు. కొత్త నిర్ణయాలు తీసుకునే అధికారం ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండదని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా గవర్నర్ ఆమోదం ఉండాలని చెప్పారు.
8న చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ
ముందస్తు ప్రచారం నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తే, ముందస్తు ఎన్నికలు జరిగితే ఏం చేయలనే అంశంపై చర్చ చేశారు. ఈ నెల 8వ తేదీన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో చర్చించనున్నారు. ఆ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సమీక్ష జరిపారు.