ఎన్నికల పోలింగ్ వేళ.. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత; భారీగా పోలీసులు!!
ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ మొదలై అందరిలోనూ తెలంగాణ పోలింగ్ పై ప్రధానంగా దృష్టి ఉంటే, మరోపక్క నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ నీటి విడుదల అంశం మరోసారి తెలంగాణ పోలింగ్ రోజున రచ్చరచ్చగా మారింది. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఆధీనంలో ఉన్న నాగార్జునసాగర్ డ్యాంకు నీటిని విడుదల చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి కష్టాలు ఎదురవుతున్నాయని ఏపీ పోలీసులు ఆందోళన చెందుతున్నారు. వారు ఎలాగైనా నీటిని విడుదల చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

ఏపీ పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను, డామ్ గేట్లను ధ్వంసం చేశారు ఈరోజు రెండు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది పోలీసులు అక్కడ భారీగా మోహరించడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాగార్జునసాగర్ డ్యాం పై తాజా పరిస్థితుల నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు ప్రయత్నించారు. దీనిని తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. నాగార్జునసాగర్ లో నీటిని విడుదల చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీరు వచ్చే అవకాశం ఉండడంతో దాదాపు 700 మంది ఏపీ పోలీసులు ఎలాగైనా సాగర్ నీటిని విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ప్రస్తుత పరిస్థితిపై నాగార్జునసాగర్ లో ఏపీ పోలీసుల భారీ బందోబస్తుపై తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పోలింగ్ రోజునే ఈ ఘటన సంభవించడంతో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కెసిఆర్ చేస్తున్న కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ గెలుస్తుంది అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ డ్రామాకు తెరలేపింది అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మొత్తంగా తెలంగాణ పోలీసుల కంట్రోల్లో ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ కి ఏపీ పోలీసులు వెళ్లడం, అది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జరుగుతున్న రోజునే కావడంతో అక్కడ ఏం జరుగుతుంది అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications