లాక్డౌన్ కఠినంగా అమలు చేయండి.!సీనియర్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్న డీజీపీ.!
హైదరాబాద్ : కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇదే నిర్ణయం క్షేత్ర స్దాయిలో పకడ్బంధీగా అమలు అయ్యేలా సీనియర్ పోలీసు అధికారులు కార్యచరణ రూపొందించుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాదికారులకు సూచించారు. కరోనా కట్టడిలో భాగంగా గతేడాది ఏ విధంగా పోలీసు శాఖ పనిచేసిందో ఈ సారి కూడా అంతకన్నా రెట్టింపు కష్టపడి పనిచేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేసారు.
కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రకటన..
అందులో భాగంగా పోలీస్ కమీషనర్లతో పాటు, ఎస్ పీ ల స్థాయి నుండి డీఐజీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగా క్షేత్ర స్థాయిలో ఉండి లాక్డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు డీజీపి మహేందర్ రెడ్డి. లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని, హైదరాబాద్ తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన పట్టణాలలో పటిష్టంగా ఆంక్షలు అమలు చేయాలని సూచించారు. దురుసుగా ప్రవిర్తించిన వారిపట్ల చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డీజిపి ప్రతిపాదించారు.
పోలీసు ఉన్నతాదికారులు భాగస్వామ్యం కావాలి.. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలన్ని డీజిపి..
అంతే కాకుండా రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాలపై ఏవిధమైన ఆంక్షలు లేవని వ్యవసాయదారులకు ఇచ్చే పాస్ ల ద్వారా వారికి ఇబ్బందికలగకుండా చూడాలని సూచించారు. జాతీయ రహదారులపైనే కాకుండా, రవాణా పై ఏవిధమైన ఆంక్షలు లేవని గుర్తు చేసారు. ప్రధాన రంగంలో ఉన్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు కానీ, పత్రికా పరమైన గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం చేసారు. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్డౌన్ నుండి మినహాయింపు ఉందని పోలీసులు కూడా వారికి తగిన స్వేచ్చ ఇచ్చేవిధంగా వ్యవమరించాలని సూచించారు.
వ్యవసాయ రంగానికి మినహాయింపులు.. రైతాంగానికి ఆంక్షలు వద్దన్న డిజీపి మహేందర్ రెడ్డి..
ఇక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని, రాష్ట్రంలో జరిగే వివాహాలకు ఇరువైపుల చెందిన 40 మంది మాత్రమే హాజరయ్యేవిధంగా చూడాలని డీజిపీ సూచించారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని, మరణాలకు సంబంధించి కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసారు. కరోనా వాక్సినేషన్ కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్ కు సంబందించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలన్నారు డిజీపి. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని డీజిపి పేర్కొన్నారు.
Recommended Video
పెళ్లిళ్లకు ఈ పాస్ లు తప్పని సరి.. పోలీసు ఉన్నతాదికారుల కార్యాలయాల్లో సంప్రదించాలన్న డీజిపి..
నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలని డీజిపి మంహేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టంతో పాటు ఐ.పీ.సి ప్రకారం తగు కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ- పాస్ విధానం ద్వారా సంబంధిత కమీషనర్లు, ఎస్. పీ లు పాసులను జారీ చేస్తారని, అత్యవసరం అనుకున్న వాళ్లు పోలీసు అధికారుల కార్యాలయాల్లోగాని, ఆన్ లైన్ లో గాని సంప్రదించి తగు పాస్ లు పొందాలని డీజీపి స్పష్టం చేసారు.