బీజేపీలో మగాళ్లు లేరా?: ఓ మహిళను బలిపశువు చేశారు: ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా.. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం చురుగ్గా సన్నాహాలు కొనసాగుతున్న వేళ- ఉద్వాసనకు గురైన ఆ పార్టీ నాయకురాలు నుపుర్ శర్మ వ్యవహారం కాస్త ఇబ్బందులకు గురి చేస్తోంది. విమర్శలకు కేంద్రబిందువు అవుతోంది. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం తప్పు పట్టింది. దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడానికి కారణం అయ్యాయని పేర్కొంది. యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలంటూ ఆదేశించింది.
నాకు వెన్నుపోటు పొడిస్తే పొడిచారు గానీ..వాళ్లతో ఆటలొద్దు: పెదవి విప్పిన ఉద్ధవ్: రాజీనామా తరువాత
దీనిపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి స్పందించారు. కొద్దిసేపటి కిందటే ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకులు తమ పార్టీ ప్రయోజనాల కోసం మతం అనే సున్నితమైన అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. తాను ఇబ్బందుల్లో పడిన ప్రతీసారీ బీజేపీ నాయకులు.. ఈ అంశాన్ని ప్రస్తావిస్తోన్నారంటూ ఆరోపించారు. ఇబ్బందులు వచ్చిన ప్రతీసారీ మతాన్ని అడ్డం పెట్టుకుంటోందని ధ్వజమెత్తారు.
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నుపుర్ శర్మ మాత్రమే క్షమాపణలు చెప్పడం సరికాదని రేణుకా చౌదరి తేల్చి చెప్పారు. మొత్తం బీజేపీ నాయకులందరూ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. చెవులు పట్టుకుని మైనారిటీలకు మన్నించాలని వేడుకోవాలని అన్నారు. బీజేపీ పరిస్థితి దయనీయంగా తయారుకావడానికి ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పారు.
Recommended Video
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓ మహిళను బలిపశువు చేశారంటూ మండిపడ్డారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే విషయంలో బీజేపీ అగ్ర నాయకులు నుపుర్ శర్మను రెచ్చగొట్టారని ఆరోపించారు. తప్పు వాళ్లు చేసి, నిందలను నుపుర్ శర్మపై వేశారని, పార్టీ నుంచి తొలగించి, అవమాన పరిచారని రేణుకా చౌదరి విమర్శించారు. మహిళకు బదులుగా తాము ముందుకు వచ్చి, క్షమాపణ చెప్పడానికి బీజేపీలో మగాళ్లు ఎవరూ లేరా? అని ప్రశ్నించారు. దేంట్లోనైనా దూకి చావండి అంటూ ఘాటుగా విమర్శించారు.