ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది టిఆర్ఎస్ కాదా: ఎజి వ్యాఖ్యపై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు అడ్వొకేట్ జనరల్ (ఎజి) రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఎవరు ఎవరి ఎమ్మెల్యేలను కొన్నారో ప్రజలకు తెలియదా అని ఆయన అడిగారు.
శాసనసభ్యులను కొనుగోలు చేసింది టిఆర్ఎస్ కాదా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. గవర్నర్ను తిట్టిన టిఆర్ఎస్ నేతలే ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది స్పష్టమైందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ మరో నేత ఎల్.రమణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 63 ఎమ్మెల్సీలు ఉన్న టీఆర్ఎస్కు 85 ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అదనంగా ఓట్లేసిన 22 మంది ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని రమణ డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలతో ఒప్పందాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఏజీ వాదనలున్నాయని రమణ అన్నారు. రాజకీయ నేతల వాదనను కోర్టులో వినిపించడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని రమణ ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో ప్రజాసమస్యలపై మాట్లాడిన రేవంత్ రెడ్డిని బ్లూస్టార్ ఆపరేషన్ చేస్తానని కేసీఆర్ హెచ్చరించారని గుర్తు చేస్తూ ఇప్పుడు అక్రమంగా కేసులో ఇరికించారని ఎల్.రమణ ఆరోపించారు.