గవర్నర్పై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్య: వీటి మాటేమిటని.. ప్రశ్నల వర్షం
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ అధికార టిఆర్ఎస్ ప్రచారకర్తగా కనిపిస్తున్నారని తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు సంచలన ఆరోపణ చేశారు. త్వరలో జిహెచ్ఎంసీ, వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికలు జరగాల్సి ఉందని, ఎన్నికల ముందు గవర్నర్ వెళ్లి ప్రభుత్వానికి సర్టిఫికేట్లు ఇవ్వడం ఏమిటన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎన్ని కడతామన్నారు? ఎన్ని కట్టారో చెప్పాలని బుధవారం నిలదీశారు. ఆయన అధికార పార్టీ ప్రచార కార్యకర్తగా ఉన్నారు తప్ప గవర్నర్గా వ్యవహరించడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యతో రాష్ట్రం తల్లదిల్లుతోందని, రోజూ పదుల సంఖ్యలో రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను గవర్నర్ ఎందుకు పరామర్శించడం లేదన్నారు. ప్రభుత్వానికి ప్రచారం వచ్చేవి మాత్రమే ఆయన వెళ్లి చూస్తారా అని నిలదీశారు.
టిడిపి నుంచి అక్రమంగా ఫిరాయించి మంత్రి పదవి పొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన అనర్హత వేటు వేయాలని ఎన్నిసార్లు కోరినా ఎందుకు స్పందించలేదన్నారు. అదే వ్యక్తిని వెంట పెట్టుకొని వెళ్లి గవర్నర్ ఇళ్లు చూడటానికి వెళ్లారని, ఇది ఎంత వరకు సమంజసం అన్నారు.
అసెంబ్లీని రెండువారాలైనా నిర్వహించవలసి ఉందన్నారు. రాష్ట్రంలో కరువు, రోజురోజుకూ పెరుగుతున్న ఆత్మహత్యలు, ప్రాజెక్టుల డిజైన్ల మార్పు, లోపభూయీష్ట గృహ నిర్మాణం, ప్రారంభం కాని డబుల్ బెడ్ ఇళ్ల అంశంపై చర్చించారన్నారు. వరంగల్ ఎన్కౌంటర్ పైనా సభలో చర్చించాలన్నారు.
మంత్రిగా కొనసాగడానికి తలసాని అనర్హుడని, అలాంటి వ్యక్తిపై అనర్హత వేయాల్సింది పోయి, అతనితో కలిసి పర్యటించడం భావ్యం కాదన్నారు. దీనిపై అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. పక్కా ఇళ్లు పథకంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారన్నారు.
పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించలేదని, గతంలో నిర్మాణం చేసిన గృహాలకు బిల్లులూ చెల్లించడం లేదని తెలిపారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సీఎంను కోరామన్నారు. గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా హైదరాబాదులో రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తున్నారన్నారు.
వాటిని చూసి మెచ్చుకున్న గవర్నర్ గతంలో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రికి ఎందుకు సూచించడం లేదో చెప్పాలని నిలదీశారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రముఖులు ప్రచారం చేసినట్లుగా, ప్రస్తుతం గవర్నర్ తీరు అలాగే ఉందన్నారు.