మాట మార్చడంలో కేసీఆర్ దిట్ట: ఎర్రబెల్లి, సీఎంకు బాధలు తెలుసు: మంత్రి జగదీశ్రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో హక్కుల కోసం పోరాడుతున్నది టీడీపీ మాత్రమేనని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా నదిపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై కేసీఆర్ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు.
బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణానికి పరోక్షంగా, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలే కారణమని ఆరోపించారు. ప్రజలకిచ్చిన మాట మార్చడంలో, ప్రజలను ఏమార్చడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట అని ఎద్దేవా చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్పై కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
సీఎంకు బాధలు తెలుసు: జగదీశ్రెడ్డి
సీఎం కేసీఆర్కు నిర్వాసితుల బాధలు తెలుసని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలం కంబాలపల్లిలో విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. చెన్నంపేట ఉస్మాన్కుంటలో వాటర్ ట్యాంకులు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నక్కలగండి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతోన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. కొత్త భూసేకరణ చట్టం ద్వారా మూడింతల పరిహారం ఇచ్చి బాధిత రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.