తెలంగాణ వచ్చాక 50 నుంచి 33 తగ్గించారేం: కెసిఆర్కు ఎర్రబెల్లి నిలదీత
హైదరాబాద్: రైతు ఆత్మహత్యల పైన శాసన సభలో చర్చ సందర్భంగా టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడారు. రుణమాఫీని ఒకేసారి మాఫీ చేయాలని, అలా చేస్తేనే రైతు ఆత్మహత్యలు కొంతమేర తగ్గే అవకాశముందన్నారు.
ప్రభుత్వం చేసే చిన్న లోపాల వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో విత్తనాల రాయితీ 50శాతం ఇస్తే, దానిని ప్రస్తుతం 33శాతానికి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలపై రాయితీని తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీశారు.
పక్కన మహారాష్ట్రలో ముఖ్యమంత్రి కరవు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ రైతుల్లో భరోసా కల్పిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదన్నారు. మంత్రులు మార్కెట్ యార్డుల్లో కూర్చుంటే రైతులకు భరోసా వస్తుందన్నారు.
మూడేళ్ల వరకు అప్పులు చెల్లించాలని రైతులను బ్యాంకులు అడగకుండా ప్రభుత్వం జీవో చేయాలన్నారు. రైతులకు రుణమాఫీ ఎంత ఆలస్యం చేస్తే అన్ని ఆత్మహత్యలు పెరుగుతాయన్నారు. ఎన్నికల హామీల్లో చెప్పినట్టు మార్కెటింగ్ ఫండ్ను ఏర్పాటు చేయాలన్నారు. దీని వల్ల రైతుల్లో భరోసా కలుగుతుందన్నారు.
రైతుల బాగు కోసం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలన్నారు. ఈ విషయంపై అవసరమైతే కేంద్రం వద్దకు అందరం కలిసి వెళ్దామన్నారు. విత్తనాల హబ్ రావాల్సిందేనన్నారు.
సాగునీటి ప్రాజెక్టులతో చెరువులను నింపాలని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలన్నారు. మార్కెట్ యార్డుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. ఓ సమయంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... నన్ను స్టేషన్లో పెట్టి, కొట్టిస్తే జ్వరం వచ్చిందన్నారు.
రైతులకు భరోసా కల్పిద్దాం: జానారెడ్డి
శాసనసభ వేదికగా రైతులకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి అన్నారు. రైతులకు ధైర్యం కలిగించేలా ప్రభుత్వ చర్యలు ఉండాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చాలన్నారు.
91 శాతం గ్రామీణ కుటుంబాలకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే ఆదాయం ఉందని, అటెండర్కు వస్తోన్న ఆదాయం కూడా రైతుకు సమకూరడం లేదన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది రైతులు రూ.లక్ష లోపు రుణాలు ఉన్నవారే అన్నారు. రుణమాఫీ వల్ల ఎక్కువ మందికి లాభం చేకూరలనేదే తమ అభిమతమన్నారు.
రాష్ట్రంలో నూటికి 80 మంది రైతులు సన్నకారు, చిన్నకారు రైతులు ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. వారు సొంతంగా పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసే స్థితిలో లేరని, రైతులకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. ప్రైవేట్ విత్తనాల కంపెనీల వల్ల రైతులకు లాభం జరగడంలేదన్నారు. విత్తనోత్పత్తికి తెలంగాణ రాష్ట్రం అనుకూల ప్రాంతమన్నారు.