వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు; జైలుకైనా వెళ్తా.. కానీ..: ఎర్రబెల్లి షాకింగ్ వ్యాఖ్యలు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తనను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన ఎర్రబెల్లి ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతుందన్నారు.
కేసులతో భయపెడుతున్నారు
అవసరమైతే జైలు కైనా వెళతాను కానీ పొరపాటున కూడా పార్టీ మారబోనని ఆయన స్పష్టం చేశారు. గతంలో కూడా తాను రైతుల కోసం పోరాటం చేసి పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లానని గుర్తు చేశారు. హామీల అమలు అడిగితే కేసులతో భయ పెడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కడియం కావ్య చిత్తు చిత్తుగా ఓడిపోతుంది
పదవుల కోసం పార్టీలు మారిన వ్యక్తి, నాలుగు సార్లు చిత్తుచిత్తుగా ఓటమిపాలైన వ్యక్తి కడియం శ్రీహరి తనపై విమర్శలు చేయడం సరికాదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. నలభై ఏళ్ళ రాజకీయ అనుభవంతో చెప్తున్నా .. కడియం కావ్య వరంగల్లో చిత్తుచిత్తుగా ఓటమి పాలవుతుందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీ గా మార్చే ఆలోచన చేస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పైనే పోటీ
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాదు టిఆర్ఎస్ పేరు మీద పోటీ చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఇక రైతుల కోసం నిర్నహించిన రైతు నిరసన దీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు అందక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎండిపోయిన పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోరాటం తప్పదు
దెబ్బతిన్న మిర్చి, ఇతర పంటలకు 25 వేల రూపాయల నష్టపరిహారం, వరి, మొక్కజొన్న పంటలతో పాటు ఇతర పంటలకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతుభీమా, రైతుబంధు, వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. లేదంటే రైతుల కోసం పోరాటం తప్పదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications