ఎర్రగడ్డ ప్రేమజంటపై దాడి: ఆ కిరాతక తండ్రిని ఎగిరితన్నిన యువకుడు!
Recommended Video
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డలో పరువు దాడి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంటపై అమ్మాయి తండ్రి బుధవారం సాయంత్రం కిరాతకంగా దాడి చేసిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై జరిగిన ఈ దాడిలో చాలా మంది అక్కడ ఉన్నప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు.
ధైర్యం చేసిన యువకుడు
కొందరు ముందుకు వచ్చినా.. నిందితుడి వద్ద ఉన్న కత్తిని చూసి భయపడి వెనక్కిపోయారు. అయితే, ఓ యువకుడు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి ఆ కిరాతకుడ్ని ఎగిరితన్నాడు. అతనిపై ఇప్పుడు అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆ కిరాతకుడ్ని ఎగిరితన్నిన యువకుడు.. హీరో అంటూ..
ఇటీవల ఒక్కటైన ప్రేమజంట సందీప్, మాధవిలపై దాడికి పాల్పడ్డ ఆమె తండ్రి మనోహరాచారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు ఆ యువకుడు. దాడి చేస్తున్న మనోహరాచారిని దూరం నుంచి ఆమాంతం వచ్చి కాలితో ఎగిరి తన్నాడు. యువకుడు తన్నిన తర్వాత అతను తిరిగి యువతిపై దాడికి దిగలేదు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యువకుడిని శభాష్ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందని నిరూపించి ఆ వ్యక్తి హీరో అయ్యాడంటూ అభినందిస్తున్నారు.
హైదరాబాద్లో మరో మారుతీరావు, కూతురు-అల్లుడిపై కత్తితో దాడి, ఆమె పరిస్థితి అత్యంత విషమం
కులాలు వేరు కావడంతో..
కులాలు వేరుకావడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో అమ్మాయికి తన మేనబావతో వివాహం చేయాలని నిశ్చయించడంతో ఇష్టం లేని మాధవి కొన్ని రోజుల క్రితం సందీప్ ఇంటికి వచ్చేసింది. 10 రోజుల క్రితం ఆల్వాల్లోని ఓ ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు తొలుత వ్యతిరేకించినా పోలీసులు నచ్చజెప్పడంతో తర్వాత ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. అప్పటి నుంచి మాధవి తన భర్తతో అత్తగారింట్లోనే ఉంటోంది.
కొత్తబట్టలు కొనిస్తానని నమ్మించి.. దారుణం
ఈ నేపథ్యంలో మాధవి తండ్రి మనోహరాచారి గత రెండు రోజులుగా ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించాడు. బుధవారం సందీప్, మాధవిలకు కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి ఎర్రగడ్డలోని హోండా షోరూం దగ్గరకు రమ్మని పిలిచాడు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడికి వచ్చిన వారిపై అందరూ చూస్తుండగానే మనోహరాచారి తనతోపాటు తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మాధవికి మెడ, చేతులపై తీవ్ర గాయాలు కాగా, సందీప్కి ముఖం నుంచి దవడ వరకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటన తర్వాత అక్కడి నుంచి పరారైన మనోహరాచారి ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రస్తుతం మాధవి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.