ఈఎస్ఐ మందుల స్కామ్ నిందితులను కస్టడీకి ఇవ్వాలా వద్దా .... నేడు తేల్చనున్న ఏసీబీ కోర్టు
తెలంగాణ ఈఎస్ఐలో మెడిసిన్స్ కొనుగోలులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ప్రధాన సూత్రధారిగా మందులు, వైద్యపరికరాల కొనుగోలులో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు కొనుగోలు చేసి సుమారు రూ.100 కోట్లకు పైగా కుంభకోణానికి తెరతీశారని విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఇక ఈ వ్యవహారంలో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో డైరెక్టర్ దేవికారాణి , జాయింట్ డైరెక్టర్ కె. పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఇందిర సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన అధికారులకు వీళ్ళు చేసిన భారీ స్కామ్ లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక వీరిని విచారించేందుకు కస్టడీకి కోరారు విచారనాదికారులు. అయితే దీనిపై కోర్టులో నేడు నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.
అర్హతలు లేని ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారన్న కుంభకోణంలో ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తరువాత తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మిగతా ఉన్నతాధికారుల ప్రమేయం అంతా వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఇక ఈ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతున్నారు విచారణాధికారులు.

ఈఎస్ఐ ఐఎంఎస్ విభాగంలో మందుల కొనుగోళ్ల అక్రమాల కేసులో నిందితుల పోలీస్ కస్టడీపై ఏసీబీ కోర్టు శనివారం విచారణ జరపనుంది. నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వాలా? వద్దా? అన్నదానిపై నేడు ఆదేశాలను ఇవ్వనున్నట్టు సమాచారం . ఈ కేసుపై శుక్రవారం కూడా ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగింది . ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చెయ్యాల్సిన అవసరం వుందని, నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని, అందుకే 8 మంది నిందితులను ఏడు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారులు కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని శనివారానికి వాయిదా వేసింది. ఈ నేపధ్యంలో కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో నిందితుల బెయిలు వ్యాజ్యంపై విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది కోర్టు.












Click it and Unblock the Notifications