నా గెలుపును ఎవరూ ఆపలేరు: కేసీఆర్ అహంకారం మీద కొట్టాలంటూ ఈటల రాజేందర్
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో తన గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వీణవంక, కనపర్తి ప్రాంతాల్లో ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్లో ప్రజలను భయపెట్టి టీఆర్ఎస్ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.
టీఆర్ఎస్ అబద్ధాలను ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు ఈటల. తనకు ఎమ్మెల్యే పదవి తన తండ్రో, తల్లో ఇవ్వలేదని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. 'కరోనా సమయంలో నేను పేషంట్ల మధ్య తిరిగితే.. కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్లో కూర్చొని నన్ను ఖతం పట్టించిండు. ఇజ్జత్ లేని దగ్గర ఉండొద్దనే పార్టీకి రాజీనామా చేశాను' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
'సొంత పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను డబ్బులు పెట్టి కొన్నాడు. నేను టీఆర్ఎస్ లోకి మధ్యలో వచ్చి మధ్యలో పోలేదు. నీ పార్టీకి 20 ఏళ్ల చరిత్ర ఉంటే.. అందులో నా చరిత్ర 18 ఏళ్ల 6 నెలలు. నా రాజీనామా వల్లే హుజూరాబాద్లో దళితబంధు వచ్చింది. నాకు ఎమ్మెల్యే పదవి నా తల్లో, తండ్రో ఇవ్వలేదు. ఈ విషయంలో కేసీఆర్ సోయి తప్పిండు. మేం శ్రమను, చెమటను నమ్ముకున్నోళ్లం. మేం పైరవీలు చేసేటోళ్లం కాదు. కేసీఆర్ కలలో కూడా నన్నే తలుచుకుంటుండు. బీజేపీని గెలిపించి.. కేసీఆర్ అహంకారం మీద దెబ్బకొట్టాలి' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Recommended Video
మరోవైపు, బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన ప్రచారంలో ఆమె మాట్లాడారు. మోసాలకు ప్రతిరూపమే సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు విజయశాంతి. మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టుల్లో నిర్వాసితులకు షెల్టర్ ఇవ్వకుండా తన్ని తరిమేశారని మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి రైతుల పొలాలకు ఒక్క చుక్క నీరు రాలేదన్నారు. బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు తీసుకుని నాణ్యతలేని చీరలిచ్చారని మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల ఫ్యామీలి రాజ్యమేలుతుందన్నారు విజయశాంతి.