రాష్ట్రాన్ని దివాళా తీయించి.. దేశంపైకి కేసీఆర్..: బాబుకు పట్టిన గతేనంటూ ఈటల రాజేందర్ విమర్శలు
హైదరాబాద్: దేశ పర్యటనకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి విమర్శలు దాడి చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ దివాళా తీయించారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేసీఆర్ రాచరికం.. అప్పులు 5 లక్షల కోట్లపైనే..: ఈటల విమర్శలు
అప్పులు చేసి రాచరికం అనుభవించడం తప్ప.. అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఈటల రాజేందర్. రాష్ట్ర అప్పు ఇప్పటికే రూ. 5 లక్షల కోట్లు దాటిందని అన్నారు. కేసీఆర్ డొల్ల తనాన్ని కాగ్ సైతం బయటపెట్టిందని తెలిపారు. కార్పొరేషన్లు ఏవీ కూడా అప్పు తీర్చే పరిస్థితి లేదని అన్నారు. ఎఫ్ఆర్బీఎం రుణాలకు దేశమంతా ఒకే విధానం వర్తిస్తుందని తెలిపారు. మంత్రులకు వారి శాఖల మీద ఎలాంటి అవగాహన లేదని, వారి మాటలకు విలువ లేదన్నారు. మిల్లర్లు క్వింటాలుకు 8 కిలోలు తరుగు తీస్తున్నా పట్టించుకునేవారు లేరంటూ మండిపడ్డారు.
ఆ రాజకీయాల్లో తలదూరిస్తే బాబుకు పట్టిన గతే కేసీఆర్కు: ఈటల
ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని, ధాన్యం సేకరణలో రైతులకు ఇంతవరకూ డబ్బులివ్వలేదని ఈటల రాజేందర్ విమర్శించారు. అధికారం ఉంది కాదా అని.. విచక్షణా రహితంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని, సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు ఈటల రాజేందర్. తెలంగాణ ప్రజలను ఎదుర్కొనేందుకు ధైర్యం లేకనే జాతీయ రాజకీయాలు అంటున్నారని కేసీఆర్పై మండిపడ్డారు. జాతీయ రాజకీయాల్లో తలదూర్చితే.. టీడీపీ అధినేత చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కూ పడుతుందని అన్నారు. రాష్ట్ర మంత్రులు ఇష్టానుసారం మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
మోడీకి ముఖం చూపించలేకనే కేసీఆర్ ఢిల్లీ పర్యటన: ఈటల
నరేంద్ర మోడీకి కాదు.. ప్రధాని కుర్చీకి గౌరవం ఇవ్వాలన్న కేసీఆర్.. ఇవ్వాళ ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ప్రధాని పర్యటన ఉందని తెలిసి.. మోడీకి ముఖం చూపించే ధైర్యం లేకనే ఢిల్లీ పర్యటనకు వెళ్లారని అన్నారు. ఇక్కడి సమస్యలు పరిష్కరించే సత్తా లేకనే కేసీఆర్ దేశ పర్యటనలు చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం పొంది... ఇప్పుడు ఈ ప్రజలనే గంగలో ముంచుతున్నారని మండిపడ్డారు. మద్యం దుకాణాల్లో నిల్వ ఉన్న లిక్కర్పై కొత్త ధరలు అమలు చేయడం దారుణమన్నారు.