ఈటల మనసులో ఏముంది... హుజురాబాద్ పర్యటనలోనూ ఎటూ తేల్చని వైనం... తదుపరి అడుగులు ఎటువైపు?
భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కదలికలు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొత్త పార్టీ వైపు మొగ్గుతారా... లేక వేరే పార్టీలో చేరుతారా... అన్న ప్రశ్నకు ఇప్పటికైతే సమాధానం దొరకలేదు. నిజానికి హుజురాబాద్ పర్యటనలో దీనిపై క్లారిటీ వస్తుందని భావించినప్పటికీ.. అలాంటిదేమీ జరగలేదు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత తన శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని హుజురాబాద్ పర్యటన ముగింపు సందర్భంగా ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

ఈటల ఏం చెప్పారు...
'హుజురాబాద్లో అన్ని స్థాయిల నేతలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకున్నాం... ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలను ఇబ్బందిపెట్టవద్దన్న అభిప్రాయం ఉంది.. తెలంగాణ ఉద్యమ సమయంలో నాతో ఉన్న అనుబంధాన్ని చాలామంది కార్యకర్తలు,నేతలు గుర్తుచేసుకుంటున్నారు... ఆనాడు 48 గంటల రైల్ రోకోకి పిలుపునిస్తే కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఒక్క రైలును కూడా కదలనివ్వకుండా ఉద్యమం జరిపాం... కాల్పులకు ఆదేశాలిచ్చినా... హెలికాప్టర్లతో పహారా పెట్టినా వెనక్కి తగ్గలేదు... అంత గొప్పగా ఉద్యమాన్ని చేపట్టాం...' అని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.

కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారన్న ఈటల...
తనకు జరిగిన అన్యాయాన్ని కార్యకర్తలంతా ఖండిస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇది భరించరానిది... సహించరానిది అంటున్నారని చెప్పారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని... వెంట నడుస్తామని చెప్పారన్నారు. కేవలం హుజురాబాద్ నియోజకవర్గం మాత్రమే గాక రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉద్యమకారులు,శ్రేయోభిలాషులు వచ్చి తనతో సమావేశమయ్యారని చెప్పారు. ఉద్యమంలో,ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన తనకే ఇంత కష్టమొస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు.

ఆత్మగౌరవమే పెద్ద సమస్య అయింది...
తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారో... ఏమి అందిందో చూశాక... ఇవాళ ఆత్మగౌరవం అనే ఇష్యూ కనిపిస్తోందన్నారు. తన పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను ఇంత అధ్వాన్నమా... దుర్మార్గమా అని కార్యకర్తలు వాపోతున్నట్లు చెప్పారు. అమెరికా,ఆస్ట్రేలియా,దుబాయ్ తదితర దేశాల నుంచి కూడా చాలా ఫోన్లు వస్తున్నాయని.. నిత్యం వేలాది మంది ఫోన్లు చేస్తూనే ఉన్నారని తెలిపారు. హుజురాబాద్ నుంచి ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నానని... అక్కడ తన శ్రేయోభిలాషులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానని వెల్లడించారు. సరైన సమయంలో నిర్ణయం ఉంటుందన్నారు.

ఈటల మనసులో ఏముంది...
ఈటల రాజేందర్ మనసులో ఏముందన్నది అంతుచిక్కడం లేదు. హుజురాబాద్ పర్యటనలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారనుకుంటే మళ్లీ వాయిదా వేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంపై కూడా ఇంకా ఎటూ తేల్చలేదు. సరైన సమయంలో నిర్ణయం ఉంటుందంటూ మళ్లీ దాటవేత ధోరణినే అనుసరించారు. అయితే విస్తృత స్థాయిలో చర్చల తర్వాతే ఆచీ తూచీ నిర్ణయం తీసుకోవాలని ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ తనను ఏకాకిని చేయడంతో... భవిష్యత్తులో తనతో కలిసి వచ్చేవాళ్లెవరు... ఎవరెవరిని కలుపుకుని ముందుకెళ్లాలి వంటి లెక్కలను ఆయన బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈటల భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications