హరీష్ నమ్ముకున్న కుట్రలోనే బలి -సిద్దిపేటలో గర్జన పెడతాం : గుణపాఠం తప్పదు - ఈటల ఫైర్..!!
సిద్ధిపేట ప్రజలు హరీశ్రావును గెలిపిస్తే.. ఆయన అధర్మం, అన్యాయం, దౌర్జన్యం పక్షాన నిలబడ్డారని హుజూరాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో హరీష్ వ్యవహరించిన తీరును ఈటల తప్పుబట్టారు. ఒకనాడు సిద్దిపేట గడ్డ తెలంగాణ కోసం పిడికిలి ఎత్తితే సంబర పడిందన్నారు. హరీష్ రావు ఎక్కడ పడితే అక్కడికి ట్రబుల్ షూటర్ పేరుతో ఎన్నికల ఇంఛార్జి గా రావడం...నియోజకవర్గాలను దత్తత తీసుకుంటా అని చెప్పడం, సిద్దిపేటలాగా మారుస్తా అంటూ ఫక్తు ఫాళ్తు మాటలు మాట్లాడి, అబద్దాల కోరు అని ముద్ర వేసుకున్నారని మండిపడ్డారు.

పిచ్చి పనులు చేయద్దంటూ హితవు
హరీష్ తనకు మాత్రమే తెలివి ఉంటుందనుకుంటారని.. ప్రజల్లో తనకే పలుకుబడి ఉందని భావిస్తారన్నారు. తాను మాత్రమే ప్లానర్..స్కీమర్ అంటూ తాను ఏం చెబితే అదే తెలంగాణ ప్రజలు నమ్ముతారనే గర్వంతో హరీష్ తిరుగుతున్నారంటూ ఈటల ధ్వజమెత్తారు. ఆ గర్వాన్ని..ముల్లును హుజూరాబాద్ ప్రజలు విరిచారని చెప్పుకొచ్చారు. హరీష్ ఒకనైనా బుద్ది తెచ్చుకోవాలని.. జ్ఞానోదయం తెచ్చుకొని, ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దు అని సిద్దిపేట గడ్డమీద నుండి హెచ్చరిస్తున్నానంటూ ఈటల వ్యాఖ్యానించారు.

నమ్ముకున్న వాటికే బలవుతారంటూ
హరీశ్రావు ఏ కుట్రలను, డబ్బులను మద్యాన్ని, దాబాయింపులను నమ్ముకున్నాడో వాటికే ఆయన బలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేశారని, ఆ దళిత బంధును తెలంగాణ అంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో కూడా దళిత గర్జన పెట్టే రోజు వస్తుందని, దానికి తానే నాయకత్వం వహిస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని చంపడానికి..మానవ సంబంధాలు తుంచడానికి..హరీష్ చేస్తున్న ప్రయత్నం వేరే దగ్గర నడిచాయి కానీ హుజురాబాద్ లో నడవలేదన్నారు.

సిద్దిపేటలోనే సభ నిర్వహించాలని
కుట్ర, డబ్బు, దబాయింపు, దౌర్జన్యం నమ్ముకున్న హరీష్ కి ఆయన నియోజకవర్గంలో కూడా గుణపాఠం తప్పదని చెప్పుకొచ్చారు. ఇటువంటి వారికి తప్పకుండా గుణపాఠం చెప్పాలని ఈటల అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీను గెలుపు బాధ్యతలు మంత్రి హరీష్ తన భుజస్కందాలపైన వేసుకున్నారు. పూర్తిగా ఆయనే ప్రచారం నిర్వహించారు. ఈటలను టార్గెట్ చేసారు. అదే సమయంలో ఈటల నియోజకవర్గానికి ఏమీ చేయలేదంటూ జోరుగా ప్రచారం కొనసాగించారు. అయితే, ఇప్పుడు ఫలితాలు వచ్చిన తరువాత ఈటల మంత్రి హరీష్ పైన కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications