Etela Jamuna Reddy: హుజురాబాద్ బరిలో ఈటల లేనట్లేనా..? జమునా రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ పోటీ నుంచి తప్పుకుంటున్నారా... తనకు బదులు సతీమణి ఈటల జమునా రెడ్డిని బరిలో దింపబోతున్నారా... తాజాగా ఈటల జమున చేసిన వ్యాఖ్యలు ఇందుకు అవుననే సంకేతాలిస్తున్నాయి. హుజురాబాద్లో ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని... తమ ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా ఒకటేనని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో హుజురాబాద్ బరిలో ఈటల రాజేందర్కు బదులు ఈటల జమునా రెడ్డి పోటీ చేయవచ్చునన్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే అభ్యర్థి విషయంలో బీజేపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుంది... నిర్ణయాధికారాన్ని ఈటల ఫ్యామిలీకే వదిలిపెడుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
ఈటల జమున ఏమన్నారు...
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈటల జమునా రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రతీ గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం(జులై 18) బుడగ జంగాల కాలనీ,కాకతీయ కాలనీల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఉద్యమ సమయంలో ఈటల రాజేందర్ బిజీగా ఉన్నప్పుడు నేనే ఎన్నికల ప్రచారం చేశాను. హుజురాబాద్లో ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మా ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా ఒకటే. ఎవరికి ఛాన్స్ వస్తే వారు ఉండొచ్చునని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎవరు పోటీ చేసినా మనిషి మారుతరు... గుర్తు మాత్రం అదే ఉంటుంది.' అని ఈటల జమునా రెడ్డి వ్యాఖ్యానించారు.
చెప్పకనే చెప్పేశారా...
ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాక ఈటల జమునా రెడ్డి రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యారు. ఒకానొక దశలో ఈటల రాజేందర్ కంటే జమునా రెడ్డే ప్రభుత్వం ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. జమునా రెడ్డి దూకుడు చూసి చాలామంది ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావొచ్చునని భావించారు. హుజురాబాద్ ఉపఎన్నికలో రాజేందర్కు బదులు జమునా రెడ్డినే పోటీలో దింపవచ్చునన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలను నిజం చేసేలా జమునా రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని ఆమె వ్యాఖ్యానించారంటే... తాను కూడా పోటీకి సిద్దంగానే ఉన్నానని చెప్పకనే చెప్పినట్లయింది.
బీజేపీ ఏం డిసైడ్ చేస్తుంది...
మరోవైపు అభ్యర్థి విషయంలో బీజేపీ అధిష్ఠానం ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు హుజురాబాద్ నియోజకవర్గంలో పాగా వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఈటల రాజేందరే అభ్యర్థి అన్నది బయట బలంగా వినిపించిన టాక్. కానీ ఈటల జమున చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లోనూ ఒకింత గందరగోళం నెలకొందన్న వాదన వినిపిస్తోంది. అసలు అభ్యర్థి విషయాన్ని బీజేపీ నాయకత్వం ఈటల ఫ్యామిలీకే వదిలిపెట్టిందా... లేక బీజేపీ నాయకత్వ సూచన మేరకే ఇద్దరిలో ఒకరు పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈటల రాజేందర్ను కాదని ఈటల జమునా రెడ్డిని రంగంలోకి దింపితే బీజేపీ సక్సెస్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.
రాజేందర్పై భిన్నాభిప్రాయాలు
ఈటల రాజేందర్పై నియోజకవర్గంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఆయన పట్ల సానుభూతితో ఉండగా... మరికొంతమంది నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఈటల జమునా రెడ్డి ప్రచారంలోనూ స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో... ఓ యువకుడు ఈటల జమున,బీజేపీ శ్రేణులపై తిరగబడ్డాడు. అభివృద్ది చేస్తామని చెప్పి ఇంటింటికి రూ.100 విలువ చేసే గడియారాలు పంచుతారా అని అతను ప్రశ్నించాడు. ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడే ఏమీ చేయని ఈటల ఇప్పుడేం చేస్తాడని నిలదీశాడు. తన సమస్యపై గతంలో బండి సంజయ్కి కూడా వినతిపత్రం ఇచ్చానని... అయినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.