ఢిల్లీ పర్యటనలో అమిత్షాతో ఈటల భేటీ..బీజేపీనేతల ఫోన్ ట్యాపింగ్ తోపాటు చర్చించిన అంశాలివే!!
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈటల రాజేందర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు బీజేపీ అగ్రనేతలతో భేటీ నిర్వహించారు. తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను, పార్టీ ముఖ్య నాయకులను కలిసి అనేక విషయాలపై చర్చించారు.

ఢిల్లీ లో అమిత్ షాతో ఈటల రాజేందర్ కీలక భేటీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన ఈటల రాజేందర్ గురువారం రాత్రి అమిత్ షా తో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కీలకంగా చర్చించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. మునుగోడు ఉపఎన్నిక జరిగిన తీరును, మునుగోడు ఉపఎన్నికల ఫలితాలను, మునుగోడు ఉపఎన్నికలో ఓటమికి గల కారణాలను సుదీర్ఘంగా చర్చించారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈటల రాజేందర్ కు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దించే అభ్యర్థుల గురించి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అమిత్ షా తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు ఈటల రాజేందర్ కు సూచించినట్టు సమాచారం.

బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలన్న ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడంపై, నాయకుల మధ్య సమన్వయం పై, ఉప ఎన్నిక సమయంలో కొందరు నేతలు పార్టీని వీడడం పైన చర్చించిన బీజేపీ నేతలు ఈటల రాజేందర్ కు అనేక కీలక సూచనలు చేశారని సమాచారం. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నేతలు ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లిన ఈటల రాజేందర్, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది.

మూడు రోజులుగా జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ
ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించుకుని బీజేపీ అగ్రనేతలు విడివిడిగా వారినుండి రిపోర్టులను సేకరించి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలను మెరుగుపరచడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నదానిపై అధ్యయనం చేస్తున్నారు.బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గత మూడు రోజులుగా ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి బి ఎల్ సంతోష్ ను, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సునీర్ బన్సల్, కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తదితరులను కలిశారు.

ఢిల్లీలో బీజేపీ కీలక నేతలు .. అగ్రనాయకులతో భేటీలు
ఈటల రాజేందర్ ను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఢిల్లీ కి రమ్మని పిలిచిన బిజెపి అగ్రనాయకత్వం వారితో సుదీర్ఘ మంతనాలు జరపడంతో పాటు పలు కీలక సూచనలు చేసినట్టు సమాచారం. ఇక వీరు మాత్రమే కాకుండా ప్రస్తుతం ఢిల్లీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ లు బీజేపీ అగ్ర నేతలను కలుస్తున్నారు.












Click it and Unblock the Notifications