బంగారు పళ్ళెంలో నీ బిడ్డ కవితకు, వినోద్ కు బీ ఫామ్ ఇస్తే గెలిచారా కేసీఆర్ ? లాజిక్ తో కొట్టిన ఈటల రాజేందర్
హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిని మించి ఒకరు హుజురాబాద్ ఉప ఎన్నికకు వ్యూహ, ప్రతివ్యూహాలతో ఇప్పటినుండి ప్రజాక్షేత్రంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. ఈరోజు బీజేపీ నేత ఈటల ప్రజా దీవెన యాత్ర ఐదవ రోజులో భాగంగా జమ్మికుంట మండలం పాపక్క పల్లి నుండి ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించారు. ఇల్లంతకుంట మండలంలోని రాచపల్లి, మల్లన్న పల్లి, టేకుర్తి, అవాల రామన్నపల్లితో పాటు గడ్డి వాని పల్లి, చిన్న కోమటిపల్లి మీదుగా ఈటల రాజేందర్ పాద యాత్ర కొనసాగుతుంది.

బంగారు పళ్లెంలో పెట్టి పదవి ఇచ్చామన్న కేసీఆర్ కు ఈటల ప్రశ్న
పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మధ్య పాదయాత్ర కొనసాగిస్తున్న ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బంగారు పళ్లెంలో పెట్టి పదవి ఇచ్చామని సీఎం కేసీఆర్ అంటున్నారని పేర్కొన్న ఈటల రాజేందర్, బంగారు పళ్లెంలో పెట్టి నీ బిడ్డకు బి ఫామ్ ఇచ్చావు .. గెలిచిందా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. బంగారు పళ్లెంలో పెట్టి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు బీఫామ్ ఇచ్చావు.. ఆయన గెలిచాడా అని లాజిక్ గా ప్రశ్నించారు. ఇవ్వడం కెసిఆర్ వంతు గెలవడం మాత్రం కష్టపడిన వాళ్ళ వంతు అని చెప్పుకొచ్చిన ఈటల తనకు పదవి కష్టానికి ప్రతిఫలంగా ప్రజలు ఎన్నుకున్నందుకు ఇచ్చిందని స్పష్టం చేశారు.

హుజూరాబాద్ లో ప్రస్తుతం జరుగుతున్న పనులు తన వల్లే అని ప్రచారం
సీఎం కేసీఆర్ తన గొంతు పిసికేస్తే అయిపోతుందని అనుకున్నాడు అని కానీ తనకు ప్రజల బలం ఉందని అది సాధ్యం కాదని ఈటల స్పష్టం చేశారు. తన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కుల, మత, పార్టీల ప్రస్తావన లేకుండా మీ కష్టం ఏంటి అని మాత్రమే అడిగానని, సాయం చేశాను అని చెప్పుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ డబ్బుని నమ్ముకుని వస్తున్నాడని పేర్కొన్న ఈటల ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుతున్న ఫలాలు, జరుగుతున్న పనులు అన్నీ తన వల్లనేనని స్పష్టం చేశారు.

తెలంగాణా పార్టీ కేసీఆర్ కుటుంబం కోసం కాదు
ప్రజల మీద ప్రేమతో కాకుండా ఓట్ల కోసం కేసీఆర్ ఇస్తాడట అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ ప్రజల్లో పుట్టింది తప్పా కేసీఆర్ కుటుంబం కోసం కాదని ఈటల రాజేందర్ మండిపడ్డారు. యావద్దేశం నివ్వెరపోయేలా తెలంగాణ ఉద్యమం కొనసాగింది అని చెప్పిన ఈటల, పన్నెండు వందల మంది బిడ్డల అమరుల త్యాగం వల్ల తెలంగాణ వచ్చింది తప్ప కెసిఆర్ ఒక్కడే చేస్తే రాలేదని తేల్చి చెప్పారు. ఆ బిడ్డల సంఘాలు మోసిన వాడిగా తనకు జెండాపై హక్కు ఉందని చెప్పానన్నారు.
Recommended Video

తాను కష్టపడటం వల్లే పదవి ..గులాబీ పార్టీ ఓనర్లు ప్రజలే
తనకు కెసిఆర్ పదవులు ఊరకనే ఇవ్వలేదని, తాను కష్టపడడం వల్ల ఇచ్చారు అని తేల్చి చెప్పిన ఈటల రాజేందర్ గులాబీ పార్టీ ఓనర్లు ప్రజలేనని మరోమారు స్పష్టం చేశారు. మొత్తానికి ప్రతిరోజు సంచలన వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్న ఈటల హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. రాష్ట్రవ్యాప్త ఆసక్తిని కలిగిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం సీఎం కేసీఆర్ వల్ల రాలేదని, ప్రజలందరి సమిష్టి కృషి అని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications