పట్టించుకోలేదు: సమైక్య పాలకులపై ఈటెల ధ్వజం
కరీంనగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య పాలకులు తెలంగాణ పండుగలను పట్టించుకోలేదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. బతుకమ్మ, బోనాలతో పాటు తెలంగాణలోని పుష్కర ప్రాంతాలపై ఆంధ్రా నేతలు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు.
ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని చెప్పారు. పుష్కరాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశామని అన్నారు. గులాబీ పుష్కరాలని ప్రచారం చేస్తూ కాంగ్రెసు నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
కరీంనగర్ జిల్లా ధర్మపురిలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్, జోగు రామన్న, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ పుష్కరాల పనులను పరిశీలించారు. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. గోదావరి పుష్కరాలకు నీళ్ల సదుపాయంపై ఆయన మాట్లాడారు.
కడెం ప్రాజెక్టు నుంచి గోదావరికి రోజూ వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయనున్నామని, వారం రోజులపాటు నీటి విడుదల కొనసాగనుందని చెప్పచారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి ప్రాజెక్టుల నుంచి గోదావరిలోకి నీరు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కడెం ఆయకట్టు రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని మంత్రి చెప్పారు.