నేడే ఈటల రాజీనామా-అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రం-ఇక అసలు పోరు షురూ అయినట్లే...
మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం(జూన్ 12) తన ఎమ్మెల్యే పదవికి,టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ శివారులోని శామీర్పేట నుంచి తన మద్దతుదారులతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్ వద్దకు చేరుకోనున్నారు.ఉదయం 10.30గం. సమయంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించనున్నారు.
Recommended Video
అనంతరం 11గం. సమయంలో అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామాను ఆ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు ఈమెయిల్ ద్వారా లేదా ఎవరైనా దూత ద్వారా పంపించే అవకాశం ఉంది. స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించిన అనంతరం ఈటల తిరిగి తన నివాసానికి చేరుకోనున్నారు.
ఈ నెల 14న బీజేపీలో చేరేందుకు ఇప్పటికే ఈటల ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బీజేపీ అగ్ర నేతలు అమిత్షా, జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి,మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ,మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ బీజేపీలో చేరనున్నారు.
ఈటల రాజీనామా లాంఛనమే కావడంతో త్వరలోనే హుజురాబాద్ ఉపఎన్నిక అనివార్యం కానుంది. ఇప్పటికే గులాబీ దళం ఆపరేషన్ హుజురాబాద్ కోసం వ్యూహాలను సిద్దం చేస్తోంది. మంత్రులను,సీనియర్ నాయకులను నియోజకవర్గంలో మోహరించే అవకాశం ఉంది. మంత్రి,టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు సీఎం కేసీఆర్ డైరెక్షన్స్ మేరకు ఆపరేషన్ హుజురాబాద్ను అమలుచేసే బాధ్యత తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్లో ఈటలను ఓడించడం ద్వారా కేసీఆర్ నుంచి దూరం జరిగిన నేతలెవరికీ రాజకీయ పుట్టగతులు ఉండవని టీఆర్ఎస్ నిరూపించాలనుకుంటోంది.
మరోవైపు హుజురాబాద్లో ఈటల పోటీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశా ఈటల పోటీ చేయకపోవచ్చునని... ఆయనకు బదులు ఆయన సతీమణి ఈటల జమునా రెడ్డి బరిలో ఉండవచ్చునన్న ప్రచారం సాగుతోంది. వరుసగా ఆరుసార్లు హుజురాబాద్ నుంచి గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఈటలకు... ఈసారి పరిస్థితులు అంత అనుకూలంగా ఉండకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈటల తనకు బదులు భార్యను బరిలో దింపే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈటల అధికారిక రాజీనామాతో నేటి నుంచి హుజురాబాద్ వేదికగా రాజకీయం మరింత రక్తి కట్టనుంది.