ఉద్యమనేతగా బాధలేమిటో నాకు తెలుసు: ఈటెల
హైదరాబాద్: ఉద్యమ నేతగా పేదల ఎస్సీల బాధలేమిటో తనకు తెలుసునని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఒక్కరికేసి నెలకు 40 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంటే, తాను ఉద్యమానికి నాయకత్వం వహించి ఆ సొమ్ము పెంచాలని డిమాండ్ చేసినవాడినని ఆయన చెప్పారు. సంక్షేమంపై ఇన్ని రోజులు శాసనసభలో ఎప్పుడూ చర్చ జరగలేదని ఆయన మంగళవారంనాడు శాసనసభలో అన్నారు.
తాము మానవీయ కోణంలో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. అంకెలు, లాభనష్టాల బేరీజు కోసం తాము బడ్జెట్ను ప్రవేశపెట్టలేదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయమని ఆయన చెప్పారు. ఉద్యమ నేతగా తాను పేదల కోసం జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించానని ఆయన చెప్పారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ప్రభుత్వాలను ప్రశ్నించామని, ఉద్యమాలు చేసినవారిగా తాము ప్రతిపక్షాల నుంచి విమర్శలు రాకుండా చూసుకోవాలని అనుకున్నామని ఆయన చెప్పారు. అత్యంత బాధ్యతతో ఎస్సీల కోసం పాటుపడుతున్నామని ఆయన చెప్పారు.
సమాన అభివృద్ధి సమాన పంపిణీ కోసమని అంబేడ్కర్ చెప్పిన మాటలకు కట్టుబడి తాము పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. గతంలో తాము ఉద్యమాలు చేస్తూ కూడా ఎస్సీల సమస్య వచ్చినప్పుడు సభకు వచ్చి తాము సహకరించామని ఆయన గుర్తు చేశారు. తాను హాస్టల్లో ఉండి చదువుకున్నవాడినని, హాస్టల్లో చేరిన తర్వాత సమాజంలో ఎంతగా కష్టపడేవాళ్లుంటారో, సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసి వచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications