ఈటీవీ, స్టార్ మా మధ్య హోరాహోరీ పోరు? విజేత ఎవరో?
తెలుగులో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అయిన ఈటీవీ, స్టార్ మా మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ పోరులో విజేత ఎవరో అనే ఉత్కంఠ తెలుగు టీవీ ప్రేక్షకులందరిలో ఉంది. మాటీవీ, జీ తెలుగు లాంటివి కొత్త కొత్త సినిమాలను భారీ ధరలకు కొనుగోలు చేసి టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నించేవి. కానీ అదే సమయంలో ఈ ఛానల్స్ కొత్త సినిమాల కొనుగోలుకు ఎంత మొత్తం ఖర్చుచేశాయో అందులో మూడోవంతు ఖర్చుకే ఈటీవీ సరికొత్త ప్రోగ్రామ్స్ ను రూపొందించి ప్రసారం చేసేది.
ఆ సినిమాలకు ఎంత టీఆర్పీ రేటింగ్ వచ్చేదో.. ఈటీవీ కార్యక్రమాలకు కూడా అంతే రేటింగ్ వచ్చేది. టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఈటీవీ అనుసరించే ఎత్తుగడ అది.
ప్రైమ్ టైమ్ కోసం మాటీవీ పట్టుదల
తర్వాత కాలంలో జీ తెలుగు, మాటీవీ కూడా ఈ విషయంలో పునరాలోచన చేశాయి. కొత్త సినిమాలను కొనుగోలు చేస్తూనే ఈటీవీకి ధీటుగా సరికొత్త కార్యక్రమాలను రూపొందించాలని నిర్ణయించాయి. ఈ విషయంలో స్టార్ మా జీ తెలుగుకన్నా ముందంజలో ఉంది. ఇటీవలి కాలంలో మా టీవీలో సీరియల్స్ కు ఆదరణ బాగా పెరిగింది. సాయంత్రం 7.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు ఉన్న ప్రైమ్ టైమ్లో వేరే ఛానల్వైపు ప్రేక్షకులు వెళ్లకూడదు అనే ధ్యేయంతో మా టీవీ మంచి కథా కథనాలున్న సీరియల్స్ ను ప్రసారం చేస్తోంది. అందుకు తగ్గట్లుగా వాటికి ఆదరణ కూడా అలాగే పెరుగుతూ వస్తోంది. అందుకు ఉదాహరణ గుప్పెడు మనసు, కార్తీక దీపం లాంటి సీరియల్స్.
మాటీవీలో ఆకట్టుకుంటున్న సీరియల్స్
మా టీవీకి పోటీగా ఈటీవీ కూడా ప్రైమ్ టైమ్లో కొత్త సీరియల్స్ ను తీసుకొచ్చింది. సీరియల్స్ మధ్య ఈ రెండు చానల్స్ పోరు ఇలా ఉండగా ప్రోగ్రామ్స్ రూపొందించడంలో, ప్రసారం చేయడంలో ఈటీవీని మించాలన్న ఉద్దేశంతో మా టీవీ సరికొత్త కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. అయితే ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలు సహజంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాటికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా చాలా సింపుల్గా ఉంటున్నాయి. కానీ మాటీవీలో వస్తున్న ప్రోగ్రామ్స్ ఈటీవీని దృష్టిలో పెట్టుకొని రూపొందించడంవల్ల సెట్టింగ్స్ కు సంబంధించి ఆర్భాటంగా ఉండటంతో అవి ఎబ్బెట్టుగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
భారీ ఖర్చుతో ఏర్పాటవుతోన్న భారీ సెట్టింగ్స్
ఈటీవీలో వచ్చే స్వరాభిషేకాన్ని, మాటీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్ కార్యక్రమాలను వీక్షిస్తే ఈ రెండింటి మధ్య ఉన్న తేడా అర్థమవుతుంది. మనం రూపొందించే కార్యక్రమం కళ్లకు శ్రమ కలిగించే విధంగా కాకుండా కంటికి ఇంపుగా ఉండాలి అనే సూత్రాన్ని మాటీవీ ఇక్కడ మరిచింది. అలాగే జబర్దస్త్కు పోటీగా వస్తున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ బ్యాగ్రౌండ్ కూడా ఎబ్బెట్టుగా ఉంటుందనే విమర్శలు ఉండనే ఉన్నాయి. భారీ ఖర్చుతో బ్యాగ్రౌండ్ సెట్ను ఏర్పాటు చేయడంవేరు.. కళాత్మకంగా తక్కువ ఖర్చుతో బ్యాగ్రౌండ్ సెట్ వేయడం వేరంటున్నారు ఆర్ట్ డైరెక్టర్లు. మొదటిదాన్ని మాటీవీ అనుసరిస్తోంటే.. రెండోదాన్ని ఈటీవీ అనుసరిస్తోంది. మంచి కార్యక్రమాలను రూపొందిస్తున్నప్పటికీ చూసే ప్రేక్షకుల కళ్లకు సెట్టింగ్స్, బ్యాగ్రౌండ్ అతి భారీతనాన్ని చూపిస్తున్నాయంటున్నారు టీవీ వీక్షకులు.
పారితోషికం విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటున్న మాటీవీ?
జబర్దస్త్ 8 సంవత్సరాల నుంచి నెంబర్వన్ ప్రోగ్రామ్గా నడుస్తోంది. ఒకరకంగా ఈటీవీని ఈ కార్యక్రమం ఒక రేంజ్లో నిలబెట్టిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమానికి పోటీగా మిగతా ఛానల్స్ అన్నిరకాల ప్రయత్నాలు చేసినప్పటివకీ అవన్నీ బెడిసికొట్టాయని చెప్పవచ్చు. అంతటి ఆదరణను జబర్దస్త్ సొంతం చేసుకుంది. తాజాగా స్టార్ మా నాగబాబు, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా కామెడీ స్టార్స్ ప్రసారం చేస్తోన్న సంగతి తెలిసిందే. కార్యక్రమాల విషయంలో ఈటీవీని మించాలన్న ఉద్దేశంతో పారితోషికం విషయంలో మా టీవీ ఉదారంగా వ్యవహరిస్తుండటంతోచాలామంది యాంకర్లు, జడ్జిలు లాంటివారంతా మాటీవీవైపు మొగ్గుచూపుతున్నారంటున్నారు. ఎక్కువ పారితోషికం ఇచ్చి ఈటీవీలో ఉండే వారిని మాటీవీవైపు ఆకర్షితులయ్యేలా యాజమాన్యం వ్యవహరిస్తోందంటున్నారు. ఇలా సీరియల్స్ కానీ, ప్రోగ్రామ్స్ విషయంలోకానీ ఇలా హోరాహోరీ పోరు నడుస్తోందని, టీవీ వీక్షకులు ఎవరిని ఆదరిస్తారో వేచిచూడాలని బుల్లితెర కార్యక్రమాలను విశ్లేషించే నిపుణులు చెబుతున్నారు.