తిండిగింజల తనిఖీలేంది.!తన్నుకునుడేంది.!అంతా బీజేపి,కేసీఆర్ కుట్రలో భాగమేనన్న కోదండరాం.
హైదరాబాద్ : ప్రజల దృష్టి మరల్చేందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమ్మక్కై కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖలు చేసారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్ర బీజేపీకి, రాష్ట్రంలో అధికార గులాబీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని కోదండరాం విశ్లేషిస్తున్నారు. ఈ రెండు పార్టీలు చాలా కాలంగా చట్ట సభల్లో ఇచ్చి పుచ్చుకునే ధోరణిని కొనసాగిస్తూ పరస్పరం సహకరించుకుంటున్నాయని కోదండరాం ఆరోపించారు.
వరి దాన్యాల తనిఖీ అంతా డ్రామా.. కేసీఆర్ బీజేపి కలిసి ఆడుతున్న నాటకాలన్న కోదండరాం
ఇటీవల జరిగిన ఉప పోరులో ఓటమి పాలై పాలనా సంక్షోభంలో కూరుకుపోయిన కేంద్ర బీజేపి, తెలంగాణలో గులాబీ పార్టీలు ప్రజల దృష్టిని మరల్చేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని మండిపడ్డారు. వీరిద్దరి వికృత రాజకీయ క్రీడ ద్వారా రాష్ట్రంలో రాజకీయంగా మరోక ప్రత్యామ్నాయ పార్టీ ఎదగకుండా చేసి ప్రజలను గందరగోళ పరిచి, రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు కోదండరాం. తమ అపవిత్ర రాజకీయ కుమ్మక్కు ఒప్పంద రాజకీయాల్లో భాగంగా గత వారం రోజులుగా ప్రసార మాధ్యమాల్లో ప్రముఖ స్థాన కోసం పోటీ పడుతున్నారని కోదండ రాం ఎద్దేవా చేసారు.
బీజేపి, టీఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వాలు.. రైతులను నిండా ముంచారన్న జనసమితి ఛీఫ్
అంతే కాకుండా బండి సంజయ్ యాత్రను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బృందం అడ్డుకుంటోందని వినూత్న డ్రామాకు తెరతీసారని మండిపడ్డారు. గతంలో రైతు చట్టాలపై నాటకీయ ఆందోళనలు చేసినట్టు హైప్ క్రియేట్ చేసి ఇప్పుడు వరి పంటను కేంద్రంగా చేసుకొని మతి స్థిమితం తప్పిన వీధి మూకల చిల్లర పంచాయితీగా రాజకీయాలను మరింత దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు వరి పంట అంశంలో, ఆహార పంటల సాగులో, కొనుగోలు విసయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతను మరచిపోయి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. కేద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల పట్ల కపట ప్రేమను కురిపిస్తున్నాయని, మొత్తం వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి రైతును వ్యవసాయానికి దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్కక్తం చేసారు.
సంజయ్ తనిఖీల కార్యక్రమం కుట్రలో భాగమే.. కమలాన్ని, గులాబీని టార్గెట్ చేసిన ప్రొఫెసర్..
అంతే కాకుండా రైతులను నడివీధిలో వాహనాలతో తొక్కించి చంపిన బిజెపి పార్టీకి రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదని, నీళ్లు ప్రధాన ఎజెండాగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీటి వినియోగం, వ్యవసాయంపై సమగ్ర విధానం రూపొందించకుండా కమీషన్ల కోసం రీడిజైనింగ్ నాటకమాడుతున్నారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు కోదండరాం. అంతే కాకుండా కోటి ఎకరాల మాగాణి పేరుతో ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి కాళేశ్వరం యాత్రల పేరుతో రైతులను అన్ని పంటల నుంచి దృష్టి మరల్చి వ్యవసాయం అంటే వరి సాగు మాత్రమే అనే పరిస్థితికి తీసుకు వచ్చిందని టిఆర్ఎస్ ప్రభుత్వం విరుచుకుపడ్డారు కోదండరాం.
ప్రత్యామ్నాయం ఉండొద్దు.. బీజేపి. టీఆర్ఎస్ కలిసే కుట్రలు చేస్తున్నాయన్న కోదండరాం..
చంద్రశేఖర్ రావు మైకంలో పడిన రైతులు సహజంగానే వరి పంటపై కొద్దో గొప్పో మిగులు ఉంటుందని ఆశతో అన్ని పంటలు పండే భూములను సైతం లక్షల రూపాయలు ఖర్చు చేసి వరి సాగుకు అనుకూలంగా మార్చుకున్నారని గుర్తుచేసారు.ఉద్యానవనాలను కూడా ధ్వంసం చేసి వరిపంట వైపు దృష్టి కేంద్రీకరించారని, చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన ఘటనను కోదండరాం గుర్తు చేసారు. ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించి రైతుని ఆదుకోవాలని ఈ వానకాలం పంట కొనుగోలుకై అన్ని ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి డిమాండ్ చేస్తోందని కోదండరాం తెలిపారు.