ముక్కు నేలకు రాస్తా.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కుతున్నాయి. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు. మధిర, కొడంగల్, సిద్దిపేట.. ఏ ఊరుకు పోదాం? సంపూర్ణ రుణమాఫీ జరిగింది అంటే ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయండి అంటూ ముఖ్యమంత్రికి సవాల్ చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. ఎప్పటి లోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువు పోతుందన్నారు. అలాగే, అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అని అన్నారు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా రేవంత్ సభలో మాట్లాడారని ఆరోపించారు.
సీఎం బూతులకు జీఎస్టీ వేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం సరిపోదని సెటైర్లు వేశారు. కేసీఆర్ చావును కోరుకున్న రేవంత్.. ఆ తర్వాత మాట మార్చి బీఆర్ఎస్ ను అన్నానని చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డిని కేసీఆర్ ఎప్పుడూ గౌరవంగా సంబోధించేవారని గుర్తు చేశారు. ఎలాంటి తప్పు చేయకున్నా జగదీశ్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దారుణమని ఆయన అన్నారు.

రాష్ట్రం పట్ల ప్రస్తుత సర్కారుకు బాధ్యత లేని కారణంగానే ప్రాజెక్టులు అగ్గిపెట్టెల్లా కూలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు. రేవంత్ నిర్లక్ష్యం వల్ల రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం.. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు ప్రభుత్వం వెంటపడతామని అన్నారు. రైతులకు రూ.15 వేల రైతు బంధు డబ్బులు పడే వరకు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు పట్ల కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని జీఎస్డీపీలో నంబర్ వన్ గా, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిపామని గుర్తు చేశారు. విద్యుత్ వినియోగంలో, వరి ధాన్యం ఉత్పత్తిలోనూ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపామని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications