సర్పంచ్ స్థాయి నుంచి మచ్చ లేని వ్యక్తినంటూ.. మంత్రి పదవి రాక రామన్న కంట తడి..!
హైదరాబాద్ : సర్పంచ్ స్థాయి నుంచి నాపై మచ్చ లేదు.. అలా రాజకీయాల్లో రాణిస్తూ మంత్రిగా ఎదిగాను. అయితే ఈసారి మంత్రి పదవి దక్కకపోవడంతో మనస్థాపం చెందాను. తొలి విడతలో కాకున్నా.. మంత్రివర్గ విస్తరణలోనైనా ఛాన్స్ దక్కుతుందని భావించాను. అదీ కుదరలేదు.. అందుకే బాధ కలిగింది అంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వెళ్లగక్కారు. రెండు రోజుల ఆజ్ఞాతం వీడి మీడియా ముందుకొచ్చిన రామన్న పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు.
మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో జోగు రామన్న ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రెండు మూడు రోజులుగా కనిపించకపోయే సరికి ఎన్నో రకాల ఊహాగానాలు చెలరేగాయి. ఆయన సీఎం కేసీఆర్ మీద అలకబూనారని.. మంత్రి పదవి రాకపోవడంతో కలత చెందారని రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చిన రామన్న తన మనసులోని మాట బయట పెట్టారు.

అనారోగ్య కారణాలతో తాను ఈ మధ్య అందుబాటులో లేనని.. బీపీ పెరిగి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానే తప్ప ఆజ్ఞాతంలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. మంత్రి పదవి వస్తుందన్న ఆశ ఉండేదని.. అది కాస్తా చేజారడంతో మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. తనకు మంత్రి పదవి రాకపోయినప్పటికీ.. ఇకపై కూడా టీఆర్ఎస్లోనే కొనసాగుతానని.. సీఎం కేసీఆరే తమ నాయకుడని స్పష్టం చేశారు.
జోగు రామన్నకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అనుచరగణంలో ఆందోళన వ్యక్తమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన అభిమాని ఒకరు కిరోసిన్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయితే పోలీసులు, స్థానికులు అప్రమత్తమై అతడిని అడ్డుకుని వారించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.












Click it and Unblock the Notifications