నోటుకు ఓటు: మాజీ టిడిపి నేతలతోనే చంద్రబాబుకు బొప్పి
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ మాజీలే బొప్పి కట్టిస్తున్నారు. చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. టిఆర్ఎస్ నేతలు, తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కెటి రామారావు, ఎంపీ బాల్క సుమన్, శాసనసభ్యులు, టిఆర్ఎస్ నాయకులు చంద్రబాబుపై తీవ్రంగా నిత్యం విరుచుకుపడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు, పోచారం శ్రీనివాస రెడ్డి వంటివారు చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. రాజకీయానుభవం పుష్కలంగా ఉండడం, రాజకీయ ప్రత్యర్తులను ఎదుర్కోవడంలో రాటు దేలడం కారణంగా వారి వ్యాఖ్యలు తీవ్రమైన స్థాయిలో ఉంటున్నాయి. ఆ నలుగురు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గంలో ఉన్నారు.
వరంగల్ లోకసభ స్థానానికి పోటీ చేసి గెలిచిన కడియం శ్రీహరిని రాష్ట్రానికి తెచ్చి కెసిఆర్ తన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా చేర్చుకున్నారు. తుమ్మల నాగేశ్వర రావు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి వెంటనే మంత్రి పదవిని చేపట్టారు. వారిద్దరిని ఎమ్మెల్సీలుగా కెసిఆర్ గెలిపించుకున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ నేరుగా టిడిపిలోంచి వచ్చి మంత్రి పదవిని చేపట్టారు. పోచారం శ్రీనివాస రెడ్డి చాలా కాలం కిందటే టిఆర్ఎస్లో చేరారు.
నిజానికి, కెసిఆర్ మంత్రివర్గంలో తొలుత చాలా మంది అనుభవం అంతగా లేనివారే ఉన్నారు. కొద్ది కాలం కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసినవారు ఉన్నారు. అయితే, అది సరిపోదని భావించే కావచ్చు, కెసిఆర్ పనిగట్టుకుని టిడిపి సీనియర్లను టిఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కెసిఆర్ గతంలో వారితో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినవారే.