హైదరాబాద్ లో ఎట్టకేలకు అందుబాటులో రానున్న మరో బ్రిడ్జి
హైదరాబాద్ లో మరో బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఫలక్నుమా సమాంతర రోడ్ ఓవర్ బ్రిడ్జి (RoB) ఎట్టకేలకు అందుబాటులోకి రానుంది. వాహనాల రాకపోకలకు సిద్ధమైంది. ఈ ఆర్వోబీని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించనుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంటూ వచ్చిన ఆర్వోబీ ఇది. 2021లో దీనికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచీ నత్తనడకన పనులు సాగుతూ వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్- దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా దీని నిర్మాణాన్ని చేపట్టాయి. అప్పట్లో ఈ ఆర్వోబీ నిర్మాణ వ్యయం 47.1 కోట్ల రూపాయలు కాగా.. నిర్మాణం పూర్తయే సమయానికి ఇది 53 కోట్ల రూపాయలకు చేరింది. 360 మీటర్ పొడవైన ఈ వంతెన పాతబస్తీలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించనుంది.

ఈ కొత్త వంతెన చంద్రాయణగుట్ట- ఫలక్నుమా ప్యాలెస్- చార్మినార్ వంటి కీలక ప్రాంతాలతో కలుపుతుంది. పాతబస్తీలో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఫలక్నుమా, ఇంజిన్ బౌలి, షంషీర్గంజ్, అలియాబాద్, చంద్రాయణగుట్ట, శాస్త్రిపురం పరిసర ప్రాంతాల వైపు ప్రయాణించే వాహనదారులు.. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించవచ్చు.
ఇటీవలే బహదూర్పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ చివరి దశలో ఉందని తెలిపారు. త్వరలో పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణ పనులు ఆటంకం లేకుండా సాగడానికి దక్షిణమధ్య రైల్వే అధికారులు చొరవ తీసుకున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు రద్దు చేయడం లేదా మళ్లించారు కూడా. గ్రేటర్ హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగం రైల్వే ట్రాక్లకు ఇరువైపులా తనవంతు పనులను పూర్తి చేసింది.












Click it and Unblock the Notifications