2001నుంచే!: ఎంతమంది బలయ్యారో.. 'ఫేక్ జాబ్స్' దందా గుట్టు రట్టు.. ఇవీ మోసాలు
హైదరాబాద్: సింగపూర్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలుకుతాడు. ఇప్పటికీ ఎంతోమందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించానని చెబుతాడు. ఎదుటి వ్యక్తిని నమ్మించి లక్షల్లో డబ్బు గుంజుతాడు.
ఇక సింగపూర్లో ఉద్యోగం వచ్చినట్లే అని కలలు కంటున్న సమయంలో అసలు విషయం తెలుస్తుంది. అతనో మోసగాడని, ఇంతకుముందు ఇలాగే చాలామందిని మోసం చేశాడని. రాజేంద్రనగర్ అత్తాపూర్కు చెందిన సయ్యద్ షకీల్ అహ్మద్ లీలలు ఇవి.
డీసీపీ కథనం ప్రకారం:
అత్తాపూర్కు చెందిన సయ్యద్ షకీల్ అహ్మద్ విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నానని.. తనకు తాను ఏజెంట్గా ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలో చందానగర్కు చెందిన షేక్ అలీం తన ముగ్గురు తమ్ముళ్లకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించాలని తెలిసిన స్నేహితుడి ద్వారా 2016జులైలో షకీల్ ను సంప్రదించాడు.
ఉద్యోగాల పేరుతో:
సింగపూర్లో సేల్స్మన్, షాప్కీపర్ ఇంకా ఇతర రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని షేక్ అలీంను నమ్మించాడు. అయితే ఇందుకోసం భారీగా ఖర్చు అవుతుందన్నాడు. డబ్బులు పోయిన పర్వాలేదు ఉద్యోగాలు వస్తాయి కదా అనుకున్న షేక్ అలీం.. షకీల్ కు మొత్తం రూ.12లక్షల డబ్బు ముట్టజెప్పారు.
హెచ్ఆర్ అవతారం కూడా:
తీరా డబ్బు ముట్టిన తర్వాత షకీల్ ఉద్యోగాల గురించి మాట్లాడటం మానేశాడు. ఎప్పుడు అడిగినా రేపు.. మాపు.. అంటూ సాగదీస్తూ వచ్చాడు. బాధితులు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో.. వారిని నమ్మించడానికి నకిలీ సింగపూర్ వీసాలు, ఇమ్మిగ్రేషన్ లెటర్లు, నియామక పత్రాలు పంపించాడు. అంతేకాదు, తానే హెచ్ఆర్ అవతారం కూడా ఎత్తి బాధితులతో ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించాడు.
ఫేక్ అని తేలింది:
షకీల్ తీరుపై అనుమానం వచ్చిన బాధితులు.. అతను పంపించిన వీసాలు, నియామక పత్రాల గురించి సింగపూర్ అధికారిక వెబ్సైట్లలో ఆరా తీశారు. దీంతో అవి నకిలీ అని తేలింది. మోసపోయామని గ్రహించిన బాధితులు సెప్టెంబరు 25వ తేదీన సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు షకీల్ను అరెస్టు చేశారు. అతడినుంచి రూ.45వేలు, హోండా కారు, పాస్పోర్టు, బ్యాంక్ పాస్బుక్లు, ట్యాబ్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 2001నుంచి షకీల్ ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.
ఇలా మోసాలు:
నిందితుడు షకీల్ గతంలో సింపూర్, మలేషియాలకు వెళ్లి వచ్చాడు. ఆ సమయంలో అక్కడి నుంచి మూడు సిమ్కార్డులు వెంట తెచ్చుకున్నాడు. వీటి ఆధారంగానే పలువురిని బురిడీ కొట్టించాడు. విదేశాల్లో ఉద్యోగాలు అని చెప్పి ఈ నంబర్స్ నుంచి కాల్ చేసేవాడు.
విదేశీ కంపెనీల పేరిట ఫేక్ మెయిల్స్ సృష్టించి అమాయకులకు వల వేసేవాడు. ఎవరైనా తనను సంప్రదిస్తే.. సింగపూర్లో సుబోధ్ అని తనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడని, అతని వద్దకు వెళ్తే.. రెండు మూడు నెలలు తాత్కాళిక వ్యవధితో ఉద్యోగాలు పొందవచ్చుననని నమ్మించేవాడు. అలా అక్కడికి వెళ్లిన కొంతమంది మోసపోయామని గ్రహించారు. అంతేకాదు, సింగపూర్, ఖతార్ ఎయిర్లైన్స్ వంటి వాటిల్లో ఉద్యోగాలంటూ కూడా షకీల్ చాలామందిని మోసం చేశాడు.