నకిలీ సిఐడి అధికారి: మహిళలకు టోకరా, వాళ్ల డబ్బులతో జల్సాలు
హైదరాబాద్: ఓ నకిలీ సిఐడి అధికారి గుట్టు రట్టయింది. అతను చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం. చెప్పుకునేది సిఐడి ఇన్స్పెక్టర్. కొత్త డ్రెస్సులు ధరించి టిప్టాప్గా తయారై బుల్లెట్, స్కార్పియో వంటి ఖరీదైన వాహనాలపై తిరుగుతూ మహిళల్ని మోసం చేస్తున్న నకిలీ ఇన్స్పెక్టర్ను ఉప్పల్ పోలీసులు అరెస్టుచేసి గురువారం కోర్టుకు రిమాండ్ చేశారు.
ఇన్స్పెక్టర్ వై.నర్సింహారెడ్డి, ఎస్ఐ లింగంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను ఏసిపి రవిచందన్రెడ్డి వెల్లడించారు. ఉప్పల్ చిల్కానగర్ రోడ్డులోని ఆదర్శనగర్లో నివసిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వడాలి శ్రీరంగరాజు(32) ఏపిఎస్పి ఫస్ట్ బెటాలియన్ కానిస్టేబుల్. 2013 బ్యాచ్కి చెందిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్ సంజీవరెడ్డినగర్ పికెట్లో పని చేస్తున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గతంలో ఎస్ఐ రిక్రూమెంట్కు హాజరైనప్పటికీ ఎంపిక కాలేదు. పోలీసు అధికారిగా డ్రెస్సులు వేసుకుంటూ బుల్లెట్, స్కార్పియోలో తిరుగుతూ కన్పించిన మహిళలను మోసం చేస్తూ వారి డబ్బుతో జల్సా చేస్తున్నాడు. ఈ క్రమంలో రామంతాపూర్లో ఉంటున్న సోదరి ఇంటి వద్దకు వెళ్లితే ఓ యువతి పరిచయమైంది. ఇదే అవకాశంగా భావించిన అతడు సిఐడి ఇన్స్పెక్టర్నని ఆమెను పరిచయం చేసుకుని మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడు. ఆమెతో కలిసి తిరిగి మోసం చేశాడు.
పెళ్లి చేసుకోమని వెంట పడటంతో ఇదివరకే తనకు పెళ్లి జరిగిందనీ, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పడంతో కలత చెందిన ఆమె జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీరంగరాజుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అతడు ఎందరో మహిళలను మోసం చేశాడని దర్యాప్తులో వెల్లడైంది.
ఫిర్యాదు చేయడానికి మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని ఏసిపి రవిచందన్రెడ్డి పేర్కొన్నారు. శ్రీరంగరాజు వద్ద స్కార్పియో, బుల్లెట్, బైక్, నకిలీ ఐడెంటీ కార్డులు, ల్యాప్టాప్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.