ఆ కాలేజీలలో చేరుతున్నారా.. డిగ్రీలో చేరే విద్యార్థులకు తీవ్ర హెచ్చరిక!
ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కాలేజీలలో చేరాలి అనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీల ఎంపిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు కీలక హెచ్చరిక చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు, విశ్వవిద్యాలయాల గుర్తింపు లేని నకిలీ విద్యాసంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.
ఫేక్ కాలేజీలు.. మోసపూరిత ప్రకటనలు
కొన్ని విద్యాసంస్థలు ఎలాంటి అధికారిక అనుమతులు లేకపోయినప్పటికీ, ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఉన్నట్టుగా , తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మి అడ్మిషన్లు పొందితే భవిష్యత్తులో విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరం, డబ్బు వృధా అవుతాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులను బురిడీ కొట్టిస్తున్న కాలేజీలపై చట్టపరమైన నిఘా
ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని అందుకు తగినట్టు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నకిలీ ప్రచారాలతో విద్యార్థులను బురిడీ కొట్టిస్తున్న కాలేజీల యాజమాన్యాలపై ఇప్పటికే చట్టపరమైన నిఘా ఉంచామని, అలాంటి సంస్థలపై కఠిన చర్యలు ప్రారంభించామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విద్యా ప్రవేశాల విషయంలో మోసపోకుండా ఉండేందుకు విద్యార్థులు ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.
డిగ్రీలో చేరాలనుకుంటే దోస్త్ యాప్
డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే వారు కేవలం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న 'దోస్త్' (DOST - Degree Online Services, Telangana) పోర్టల్లో నమోదైన కాలేజీలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆయా వెబ్సైట్ ద్వారా సదరు కాలేజీ గుర్తింపు, సీట్ల లభ్యతను స్వయంగా పరిశీలించుకోవచ్చని తెలిపారు. ప్రైవేట్ ఏజెంట్లు లేదా అనధికారిక సంస్థల మాటలు నమ్మి నేరుగా కాలేజీల్లో చేరవద్దని సూచించారు.
డిగ్రీలో చేరిక విషయంలో జాగ్రత్త
ఏ కాలేజ్ పడితే అందులో చేరితే భవిష్యత్ నాశనం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏదైనా కాలేజీ ప్రవర్తనపై అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. విద్యాసంస్థల పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చేరిక విసయంలో నిర్ణయం తీసుకోవాలని, అప్రమత్తత ఒక్కటే ఇటువంటి మోసాల నుండి రక్షిస్తుందని పోలీసులు ఈ సందర్భంగా పౌరులకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications