మరో స్వామిజీ 'రతి'లీలలు: భక్తుల భార్యల్ని రప్పించుకుని కామకేళి, ఎట్టకేలకు..
భర్తలతో కలిసివచ్చే మహిళలతో భర్తలకు తెలియకుండా పరిచయం పెంచుకునేవాడు.
హైదరాబాద్: ఆధ్యాత్మికత, భక్తి ముసుగులో రోజుకో కొత్త బాబా పుట్టుకొస్తూనే ఉన్నాడు. అమాయక జనం నమ్మకమే పెట్టుబడిగా తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న రీతిలో వారి బాగోతాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా బాబాల ఆగడాలు వెలుగుచూస్తున్న తరుణంలో.. మరో స్వామిజీ లీలలు బయటపడ్డాయి.
బాలాపూర్ అయోధ్యనగర్ కు చెందిన వెంకట లక్ష్మీనరసింహాచార్యులు జ్యోతిష్యుడిగా పేరు సంపాదించాడు. పలు టీవి ఛానెళ్లలో జ్యోతిష్య కార్యక్రమాల ద్వారా పాపులర్ అయ్యాడు. అలా ఎంతోమంది అమాయకులను ఆకర్షించి.. వారి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి లక్షల్లో డబ్బు గుంజాడు.
ఎవరీ లక్ష్మీ నరసింహాచార్యులు?:
ఖమ్మం జిల్లా గుడిమెట్లకు చెందిన వెంకట లక్ష్మీనరసింహాచార్యులు అలియాస్ విష్ణు(44) ఏడేళ్లుగా నగరంలోని బాలాపూర్ సమీపంలోని అయోధ్యనగర్లో ఉంటున్నాడు. చదివింది పదో తరగతి వరకే. జ్యోతిష్యంలో మెలకువలు నేర్చుకుని, మీర్పేట ఠాణా పరిధిలోని గాయత్రీనగర్లో 'భవిష్య వాణి' పేరిట కార్యాలయం ప్రారంభించాడు.
పలు బ్రాంచ్లు:
తనకు తాను ఓ పేరు మోసిన జ్యోతిష్యుడినని చెప్పి విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరుల్లోనూ బ్రాంచ్లు తెరిచాడు. తన మాటలకు ఆకర్షితులై వచ్చేవారి నుంచి రూ.1లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసేవాడు. భక్తుల సమస్యలను ఆసరాగా చేసుకుని, వాటికి పరిష్కరించాలంటే అడిగినంత ఇవ్వాల్సిందేనని పట్టుబట్టేవాడు. నిజంగానే సమస్యలు పరిష్కరమవుతాయని నమ్మే మూఢ భక్తులు చాలామంది అతని చేతిలో మోసపోయారు.
భర్తలకు తెలియకుండా భార్యలతో:
తన వద్దకు వచ్చే మహిళలను లక్ష్మీనరసింహచార్యులు తెలివిగా లోబరుచుకునేవాడు. భర్తలతో కలిసివచ్చే మహిళలతో భర్తలకు తెలియకుండా పరిచయం పెంచుకునేవాడు. ఆపై వారికి దగ్గరై.. భక్తి పేరుతో లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. వాళ్ల భర్తలకు తెలియకుండా వారిని రప్పించుకునేవాడు. అలా చాలామంది మహిళలను ఈ స్వామిజీ లోబరుచుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా వెలుగులోకి:
లక్షల కొద్ది డబ్బు ఇచ్చినా.. తమ సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడంతో కొంతమంది తమ డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందిగా స్వామిజీని డిమాండ్ చేశారు. అయితే తానో సీబీఐ అధికారినంటూ నకిలీ ఐడీ కార్డు, డమ్మీ తుపాకీ చూపించి స్వామిజీ వారిని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక వారు పోలీసులను ఆశ్రయించారు. వనస్థలిపురం, సరూర్నగర్, మీర్పేట, బాలాపూర్ ఠాణాల పరిధిలో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం పోలీసులు ఈ నకిలీ స్వామిజీని అరెస్ట్ చేశారు.
స్వాధీనం చేసుకున్నవి:
నకిలీ స్వామిజీ పలువురి నుంచి రూ.50 లక్షల వరకు వసూలుచేసినట్టు గుర్తించామన్నారు. అలాగే నకిలీ తుపాకీ, పూజ సామగ్రి, 2 ల్యాప్ట్యాప్లు, 2 తులాల బంగారు నగలు, 5 కిలోల వెండి వస్తువులు, రూ.5 లక్షల నగదు, ఓ కారు, ఓ సీబీఐ అధికారి నకిలీ గుర్తింపుకార్డు, 5 సెల్ ఫోన్స్ గుర్తించినట్లు తెలిపారు.