రైతు ఆత్మహత్య, చెల్లెల్లి ఆత్మహత్యాయత్నం: మామను కొట్టి చంపిన అల్లుడు
నల్గొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం సపావతుతండాలో మెగావత్ శీను అనే యువ రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తట్టుకోలేని అతడి సోదరి లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. శ్రీను కుటుంబం గత రెండుమూడేళ్లుగా వ్యవసాయంలో లాభం లేకుపోవడంతో అప్పులో కూరుకుపోయింది. దీంతో తండ్రి బాధను చూడలేక శీను ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారంనాడు జిల్లాలో అప్పుల బాధతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
నల్లగొండ జిల్లా మేళ్లచెర్వులో మామను రోకలిబండతో అల్లుడు కొట్టి చంపాడు. తరచూ మద్యం తాగి మనమరాలిని వేధిస్తుండటంతో ఆగ్రహించిన అల్లుడు మామను కొట్టి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో మోసం, యువతి ఆత్మహత్యాయత్నం
కాగా, నల్లగొండ జిల్లా అనుముల మండలం శ్రీరాంపల్లిలో ప్రేమ పేరుతో ఓ యువతిని సర్పంచ్ సుదర్శన్ మోసం చేశారు. ప్రేమించానని చెప్పి, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. దీంతో యువతిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.