ఓ పక్క రైతు ఆత్మహత్యలు.!మరోపక్క రైతుబందు సంబురాలా.?ఇది రాబందుల ప్రభుత్వమన్న సీతక్క.!
భూపాల పల్లి/హైదరాబాద్ : సంక్రాంతి పర్వదినం సందర్బంగా రైతులకు ధైర్యం నూరిపోసారు జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ములుగు శాసనసభ్యురాలు సీతక్క. టేకుమట్ల మండలంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతుల పట్ల సీతక్క స్పందించారు. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు అధైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీతక్క స్పష్టం చేసారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేంతవరకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీతక్క పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలో రైతులు..రైతు సంబురాలు ఆపాలన్న సీతక్క
ఒక ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టిన మిర్చి రైతులంతా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్ళకి ప్రభుత్వం భరోసా కల్పించి రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సీతక్క ద్వజమెత్తారు. రైతుల వద్దకు వెళ్లి కనీసం ఆత్మస్తైర్యం కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, టిఆర్ఎస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని ఆవేదవ్యక్తం చేసారు.టేకుమట్ల మండలంలో సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన మిర్చి రైతు రవీందర్రావు మిర్చితోటలో, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, గుమ్మడవెల్లి గ్రామంలో దళిత రైతు అక్కినపల్లి సారయ్య పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమనన్నారు సీతక్క.
రైతులు సంతోషంగా లేరు.. పిట్టల్లా రాలి పోతున్న మిర్చి రైతులన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
రైతులు చనిపోతుంటే ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు రైతుబంధు సంబురాలు చేస్తున్నారని, తెలంగాణలో ఎక్కడా కూడా రైతులు సంతోషంగా లేరని, మిర్చి పంటలు నాశనం కావడంతో, వరి పంట పండిస్తే సకాలంలో ప్రభుత్వం కొనక, తరుగు పేరుతో ఒక బస్తా, మూడు నుండి నాలుగు కిలోలు, ఒక క్వింటాలుకు 10 నుండి 12 కిలోల కోత విధిస్తూ మిలర్లతో ప్రభుత్వం కుమ్మకై, నాయకులు రాక్షస ఆనందం పొందుతున్నారని సీతక్క ద్వజమెత్తారు. ఇది రైతు ప్రభుత్వం కాదని, రాక్షస ప్రభుత్వం, రైతుల రక్తం తాగే ప్రభుత్వమని మండిపడ్డారు సీతక్క.
మిర్చి రైతులకు 50 వేల నష్టపరిహారం.. టీ సర్కార్ ను డిమాండ్ చేసిన సీతక్క
వందల ఎకరాలు ఉన్న నాయకులకు లక్షల్లో, కోట్లలో రైతుబంధు డబ్బులు పడితే, వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఈ రోజు రైతుల సంబరాలు అంటున్నారని, దీన్ని తెలంగాణ రైతాంగం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నానని సీతక్క పేర్కొన్నారు. మీరు రైతు సంబరాలు బంద్ చేసి, రైతు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి పరిశీలించి రైతులకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కల్పించి, ప్రభుత్వం తరఫున మిర్చి రైతులకు 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా సీతక్క డిమాండ్ చేసారు.
పండుగ కాదని పంటపొలాల్లో సీతక్క.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ
శుక్రవారం టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామంలోని మిర్చి పంటలను జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ములుగు శాసనసభ్యురాలు సీతక్క పరిశీలించారు. భూపాలపల్లి నియోజకవర్గ రైతు పక్షపాతి ప్రజానాయకుడు గండ్ర సత్యనారాయణ, కోటగిరి సతీష్ గౌడ్, బండ శ్రీకాంత్, మాజీ సర్పంచులు పెరుమండ్ల లింగయ్య, రాజమౌళి, కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల రాజు, మధుకర్ విగ్నేష్ అనీల్ తదితరులు పాల్గొనన్నారు.