కన్న కొడుకును చంపేసి, ట్రాక్టరుతో తొక్కించి.. ఓ తండ్రి దారుణం
కరీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి కన్న కొడుకును చంపేసి, దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలో జరిగింది. సంజీవ్ అనే వ్యక్తి తన పన్నెండేళ్ల కొడుకును చంపేశాడు.
కుటుంబ తగాదాల వల్ల అతను తన కొడుకును చంపేశాడు. సంజీవ్, ఆయన భార్య మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు ఉన్నాయి. పెళ్లి సమయంలో భార్య తల్లిదండ్రులు కట్నంగా భూమిని ఇచ్చారు. ఆ భూమిని అమ్మాలని సంజీవ్.. భార్యతో గొడవకు దిగేవాడు.
ఈ గొడవ ముదిరింది. ఆమెను కొట్టేవాడు. దీంతో భార్య తన చిన్న కుమారుడితో పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద కొడుకు రంజిత్ తాత (తండ్రి తండ్రి) వద్ద ఉండి చదువుకుంటున్నాడు. రంజిత్ ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు.
కొడుకును తండ్రి సంజీవ్ ఆసుపత్రికి తీసుకుళ్లాడు. అయితే, రాత్రికి సంజీవ్ ఒక్కడే ఇంటికి వచ్చాడు. రంజిత్ ఎక్కడ అని అతని తల్లిదండ్రులు అడిగారు. అతను పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కలిసి వెళ్లి వెతికారు.
పొలం వద్ద వెతకగా ట్రాక్టర్ కేజ్ వీల్స్ కింద పడి రంజిత్ శవం కనిపించింది. సంజీవ్ తన తనయుడిని చంపేసి, ఆ తర్వాత ట్రాక్టర్ చక్రాలతో తొక్కించి చంపేశాడని.. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని ప్రమాదంగా చూపే ప్రయత్నం చేశాడని చెప్పింది.