ఆఫ్రికా తల్లిని హత్య చేసిన తండ్రి: కూతురు సానియా ఎటు... (ఫోటో)
హైదరాబాద్: తల్లి సింథియాను తన తండ్రి రూపేష్ హత్య చేయడంతో వారి కూతురు సానియా ఎవరికి చెందాలనే విషయంపై వివాదం కొనసాగుతోంది. ఆఫ్రికాలోని కాంగోకు చెందిన సింథియాను భర్త రూపేష్ అత్యంత కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికి తగులబెట్టిన విషయం తెలిసిందే.
సానియా ఎవరికి చెందాలనే వ్యవహారంలో శుక్రవారం రాజేంద్రనగర్, ఎల్బీనగర్ కోర్టుల్లో అనేక తర్జన భర్జనల తర్వాత కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సింథియా కూతురు సానియాను తమకు అప్పగిస్తే కాంగోకు తీసుకువెళ్లేందుకు ఆమె మేనమామ డేవిస్ ఓ వైపు న్యాయపోరాటం చేస్తున్నాడు.
మరో వైపు సానియా తమ వద్దే ఉంటుందని నిందితుడు రూపేష్ కుమార్ మోహనానీ తల్లిదండ్రులు కోర్టును వేడుకొంటున్నారు. చిన్నారి సానియా అప్పగింతపై శుక్రవారం రాజేంద్రనగర్ కోర్టులో జరిగిన విచారణకు కాంగో ఎంబసీ అధికారులు హాజరయ్యారు. అయితే సానియా ఏ గూటికి చేర్చాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టుకు రాజేంద్రనగర్ కోర్టు సిఫారసు చేసింది.
దాంతో మధ్యాహ్నం పోలీసులు సానియాను తీసుకుని ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళారు. ఈ అంశాన్ని విచారించిన తర్వాత ఎల్బీనగర్ కోర్టు తిరిగి వ్యవహారాన్ని రాజేంద్రనగర్ కోర్టుకు పంపింది. దాంతో పోలీసులు మళ్లీ సానియాను తీసుకొని సాయంత్రం రాజేంద్రనగర్ కోర్టుకు చేరుకున్నారు. సానియా అంశాన్ని మరోసారి పరిశీలించిన రాజేంద్రనగర్ కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
అప్పటివరకు సానియాను హైదర్షాకోట్లలోని కస్తూర్బా ట్రస్టు రెస్క్యూ హోంలో పెట్టాలని కోర్టు ఆదేశించింది. శుక్రవారం కోర్టులకు వెళ్లే సమయంలో సానియా మాత్రం తన నానమ్మ షీలాదేవితో రోజంతా ఆడుకుంటూ కనిపించింది. ఇదిలా ఉంటే, సింథియా హత్య కేసును శంషాబాద్ రూరల్ పీఎస్ నుంచి మాదాపూర్ సీసీఎస్కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు రూపేష్కుమార్ను మూడురోజుల కస్టడీకి ఇవ్వాలని మాదాపూర్ సీసీఎస్ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు.