కన్న కొడుకునే అమ్మేసిన కసాయి తండ్రి; తల్లి ఊరుకుంటుందా!!
బంధాలు, అనుబంధాలు రోజురోజుకీ మృగమై పోతున్నాయి. కంటికి రెప్పలా పిల్లలు కాపాడుకోవలసిన తల్లిదండ్రులే పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలకు అప్పగిస్తున్నారు. డబ్బు కోసం ఆశపడి కడుపున పుట్టిన బిడ్డలను విక్రయిస్తున్నారు. రక్త సంబంధాలు మరచిపోయి పిల్లలను అమ్ముకుంటున్నారు. తాజాగా వరంగల్ లో అటువంటి ఘటన చోటు చేసుకుంది.
వరంగల్ లో చోటుచేసుకున్న దారుణ ఘటన వివరాల్లోకి వెళితే వరంగల్ కరీమాబాద్ కు చెందిన మసూద్ అనే వ్యక్తి 4 ఏళ్ల వయసున్న కన్నకొడుకును విక్రయించిన ఘటన చోటు చేసుకుంది. కరీమాబాద్ కు చెందిన మసూద్ చిన్న కుమారుడు అనారోగ్యంతో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డబ్బుల కోసం తండ్రి తన పెద్ద కుమారుడైన నాలుగు సంవత్సరాల వయసున్న అయాన్ ను పిల్లల్ని విక్రయించే ఒక గ్యాంగ్ కు అమ్మేశాడు.

తన సోదరి ఇంటికి తీసుకు వెళుతున్నా అని భార్యకు చెప్పి పోచమ్మ మైదాన్ సెంటర్ లో ఓ పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాకు విక్రయించాడు. కొడుకుతో వెళ్లిన భర్త ఇంటికి ఒక్కడే రావడంతో భార్య భర్తను నిలదీసింది. విషయం తెలుసుకున్న భార్య, భర్త కొడుకును అమ్మేశాడు అని గ్రహించి సోదరుడు సహాయంతో మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు పిల్లవాణ్ణి విక్రయించిన ముఠాను కూడా పట్టుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు అని సమాచారం. గతంలోనూ వరంగల్ లో అనేక సందర్భాలలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పిల్లలని విక్రయించే ముఠాలు వరంగల్ నగరంలో గుట్టు చప్పుడు కాకుండా దందా చేస్తున్నాయి. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ను అరికట్టాల్సిన అవసరం, చిన్న పిల్లల విక్రయాలను ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications