టిఆర్ఎస్లోకి జగన్ పార్టీ టీ అధ్యక్షుడు పొంగులేటి?: నేతల నిలదీత, ఎదురుదాడి
హైదరాబాద్: తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో సోమవారం జరిగిన ఆ పార్టీ కార్యవర్గ సమావేశం రసాభాసగా మారింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఇటీవలి కాలంలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పొంగులేటి పార్టీ ఫిరాయింపునకు పాల్పడుతున్నారన్న అంశం చుట్టూనే సమావేశమంతా జరిగింది. 'మీరు పార్టీ మారుతున్నారట కదా? 'అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నిలదీయడం, అవన్నీ వదంతులేనని పొంగులేటి సమర్థించుకోవడం.. సమావేశం ఆద్యంతం ఇదే కొనసాగింది.
హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 11 నెలల తర్వాత ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అధికార టిఆర్ఎస్ వైఫల్యాల గురించిన అజెండాపై అధ్యక్షుడు నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఏప్రిల్లోనే టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్టీ ఫిరాయింపుపై సమావేశంలో పలువురు నాయకులు పొంగులేటిని సూటిగా ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. టిఆర్ఎస్ పార్టీలో చేరివుంటే ఇప్పటికే మంత్రినయ్యేవాడినని చెప్పినట్లు ఓ నాయకుడు తెలిపారు. పార్టీ మారాలనుకుంటే ధైర్యంగా అందరికీ చెప్పే వెళ్తానని.. నిలదీసిన నాయకులపై పొంగులేటి ఎదురుదాడికి దిగినట్లు చెప్పారు.