దిగ్విజయ్ సింగ్ వరుస భేటీలు: టీ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్, మూడు ప్రశ్నలు
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సింది పోయి.. సీనియర్లు.. జూనియర్లు అంటూ కొట్టుకుంటారా? అని ఆ పార్టీ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ నేతలను మందలించారు. గాంధీభవన్ వేదికగా అసంతృప్తితో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను ఆయన ఒక్కొక్కరిగా భేటీ అయ్యారు. పీసీసీ నిర్ణయాలు, సమస్యలను రాష్ట్ర నేతలు దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లారు.
పార్టీ బలోపేతానికి అంతా కలిసి పనిచేయాలని నేతలందరికీ దిగ్విజయ్ సింగ్ సూచించారు. అధిష్టానం తెలంగాణ పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తే అధిష్టానం చూస్తూ ఊరుకోదని దిగ్విజయ్ సింగ్ నేతలను హెచ్చరించినట్లు సమాచారం.
పీసీసీ జంబో కమిటి ప్రకటన తర్వాత సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, ఆయనను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ సింగ్ అధిష్టానం దూతగా వచ్చి నేతల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. గురువారం వరుసగా నేతలందరి అభిప్రాయాలను విన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు వీ హనుమంతరావు, జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితర నేతలు దిగ్విజయ్ సింగ్ కు తమ వాదనను వినిపించారు.
పీసీసీ ఏకపక్ష నిర్ణయాల వల్లే నాయకుల మధ్య విభేదాలు వచ్చాయని వీహెచ్ తెలిపారు. దిగ్విజయ్ సింగ్ సమస్యల్ని పరిష్కారిస్తారని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సింగ్ భేటీ తర్వాత సీనియర్ నేతల వైఖరిపై మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి తప్పుబట్టారు. ఒరిజినల్, వలసదారులు అన్న వాదన తెరపైకి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే సమస్యలన్నీ సర్దుకుంటాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. తమ రాజీనామాలను వెనక్కి తీసుకోలేదన్నారు. పార్టీలోకి వచ్చిన సమయంలో అందరూ కొత్తవారేనని వ్యాఖ్యానించారు. కొంతకాలానికి వారే సీనియర్ నేతలవుతారని అన్నారు. ఒకటిరెండు రోజుల్లో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని దిగ్విజయ్ సింగ్తో భేటీ అనంతరం తెలిపారు.
పార్టీ నేతలతో సమావేశమైన సమయంలో దిగ్విజయ్ సింగ్.. పార్టీ కోసం అంతా కలిసి పనిచేయాలని సూచించారు. జూనియర్, సీనియర్ అనే పంచాయతీ సరికాదన్నారు. సమస్యలుంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలే గానీ.. మీడియా ముందు మాట్లాడకూడదని తేల్చి చెప్పారు. తన వద్దకు వచ్చిన నేతలతో మూడు ప్రశ్నల అజెండాతో దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ను ఓడించడానికి మీ దగ్గర ఉన్న వ్యూహమేంటి?, పార్టీ బలోపేతానికి మీ పాత్రేంటి?, పార్టీ కోసం ఏం చేస్తున్నారు? అని దిగ్విజయ్ సింగ్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సీనియర్లు, జూనియర్లు అంతా కలిసి పనిచేయాలని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. కాగా, దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్ లో ఉన్న సమయంలోనే పలువురు కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడటం గమనార్హం. దీంతో దిగ్విజయ్ సింగ్ మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చింది ఇవి చూడటానికేనా? అని మండిపడ్డారు.