చివరి గింజా కొనేదాకా చివరి నిమిషం వరకూ కొట్లాడాలె.!పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల నిరసన.!
ఢిల్లీ/హైదరాబాద్ : వరి కొనుగోలు అంశం పార్లమెంట్ సమావేశాలను కుదిపేసేలా కనిపిస్తోంది. వరి కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మాణం ప్రవేశపెట్టగా గులాబీ ఎంపీలు ఏకంగా నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ధాన్యం దిగుబడుల మేరకు ఎఫ్సీఐ కొనుగోళ్లు చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేసారు. ఇందుకనుగుణంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్ హౌస్ తో పాటు ఆవరణలో గులాబీ ఎంపీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల నిరసన..వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్లకార్డుల ప్రదర్శన
తెలంగాణ వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేశారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేయొద్దని నినాదాలు చేశారు. జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్సభ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
రైతుల కోసం ఆందోళన..ధాన్యం సేకరణపై గులాబీ ఎంపీల వాయిదా తీర్మానం
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందు చూపుతో రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలు అందిస్తున్నామని ఎంపీలు అన్నారు. రైతులకు 24 గంటలూ నాణ్యమైన ఉచిత కరెంటు అందించడం వల్ల దిగుబడులు పెరిగాయన్నారు. ధాన్యం దిగుబడుల మేరకు ఎఫ్సీఐ కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాకుండా రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను తీసుకురావాలని కోరారు. తెలంగాణలో రైతులకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలు అమలవుతున్నాయని గులాబీ ఎంపీలు గుర్తు చేసారు.
ధాన్యం సేకరణపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలి.. పోరాటం ఉదృతం చేస్తామన్న టీఆర్ఎస్ ఎంపీలు
ఆ సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల కోసం ఆందోళన చేస్తామని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు.
Recommended Video
రైతులకోసం అనేక సంక్షేమ పథకాలు.. అందుకే వరి దిగుబడి గణనీయంగా పెరిగిందన్న ఎంపీలు
దీంతో లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇతర సభ్యులు నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద నిరసన చేశారు. తెలంగాణ రైతులను శిక్షించవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణలో పంజాబ్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా? అని టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నించారు. వానాకాలంలో తెలంగాణలో దాదాపు రెండె కోట్ల టన్నుల ధాన్యం పండిందని, రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగైందని ఎంపీలు స్పష్టం చేసారు.