సంక్షేమ పథకాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కలకలం
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జనసమీకరణ కోసం వీణవంకలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జెండా మోసిన వాళ్లకే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని జెండాలు మోసిన వారికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముందుగా అందుతాయని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే లబ్ధిదారులకు త్వరలో సీఎం కేసీఆర్ రూ. 3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నారని చెప్పారు.
ఈ పథకంలోనూ టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. లబ్ధిదారుల ఎంపికలో గ్రామ సర్పంచ్, పార్టీ అధ్యక్షుడు ఇచ్చే లిస్టే ఫైనల్ అవుతుందని తేల్చేశారు.
అయితే, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దుమారం రేగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు కాకుండా పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారా? అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.