నార్సింగిలో చేపల వర్షం: ఏరుకునేందుకు పోటీపడ్డారు!
హైదరాబాద్: నగర శివారు ప్రాంతంలోని రాజేంద్రనగర్ మండలం నార్సింగి గ్రామంలో మంగళవారం చేపల వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో నార్సింగిలోని బాబూ జగ్జీవన్రాం యువజన సంఘ భవనం సమీపంలో రోడ్డుపై చేపలు కనిపించాయి.
దీంతో మొదట స్థానికులు ఈ చేపలు ఎక్కడి నుంచి వచ్చాయని అనుమానంగా చూశారు. ఆ తర్వాత కొద్ది సేపట్లోనే మరోసారి కురిసిన భారీ వర్షం వెంట చేపలు నేలపై పడ్డాయి. దీంతో చేపలు వర్షంతోనే వచ్చిపడ్డాయని తెలిసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే చేపలను ఏరుకునేందుకు జనం పోటీ పడ్డారు.
ఇది ఇలా ఉండగా, నగరంలో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. షాపూర్ నగరంలో కేవలం రెండు గంటల వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్లో 9.6 సెం.మీ., మాదాపూర్లో 2.4, మల్కాజిగిరిలో 2.3 సెం.మీ. చొప్పున కురిసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
బాలానగర్, బొల్లారం, తిరుమలగిరి, మలక్పేట, మాదన్నపేట, యాకుత్పుర, చాదర్ఘాట్, ఖైరతాబాద్, మల్లాపూర్, నాచారం తదితర ప్రాంతాల్లో పలు కాలనీలు జలమయం అయ్యాయి.
బుధవారం ఉదయం కూడా మెహిదీపట్నం, మాసబ్ట్యాంక్, రేతిబౌలి, టోలిచౌకి, షేక్పేట, లక్డీకాపూల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్.. తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందనే బేగంపేట వాతావరణ కేంద్రం హెచ్చరికతో యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిబ్బందిని ఆదేశించింది.