చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్: 6కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్: నగర పరిసరాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పోలీసులు 6.3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
మొత్తం 228 కేసులో చోరీకి గురైన బంగారాన్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాకిస్థాన్లో ఉగ్రవాదుల దాడి దృష్ట్యా నగర పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఏపి అసెంబ్లీకి అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామని మహేందర్ రెడ్డి తెలిపారు.
బోరబండలో భారీ చోరీ
బోరబండలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి 16 తులాల బంగారం, రూ. 10 వేల నగదును అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండలో దొంగల బీభత్సం
నల్గొండ: జిల్లాలోని బీబీనగర్ మండలం మగ్దుంపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. మంగళవారం రాత్రి మగ్దుంపల్లి శివార్లలో గొర్రెల కాపరిని దొంగలు హత్య చేశారు. అనంతరం 20 గొర్రెలను అపహరించారు. ఈ ఉదయం గొర్రెల కాపరి వద్దకు కుటుంబ సభ్యులు వెళ్లగా కాపరి రక్తపు మడుగులో పడి ఉన్నారు. కాపరి బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
దారుణం: కాళ్లు, మెడ నరికి వృద్ధురాలి హత్య
మహబూబ్నగర్: జిల్లాలోని ఖిల్లాఘనపురం మండంల తిరుమలాయపల్లిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కాళ్లు, మెడ నరికి కిరాతకంగా చంపారు గుర్తు కొందరు దుండగులు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.