వేదికపై మోడీ-ఇవాంకా-కేసీఆర్ మాత్రమే: భద్రత కట్టుదిట్టం
Recommended Video
హైదరాబాద్: నగరంలోని ఇంటర్నేషనల్ కన్వెష్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు నవంబర్ 28న ప్రారంభం కానుంది. ఈ సదస్సును ఎంతో ప్రాతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే దాదాపు పూర్తి చేసింది.
మోడీ-ఇవాంకా-కేసీఆర్
ఈ కార్యక్రమానికి సంబంధించి మరో విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంకా ట్రంప్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లు మాత్రమే వేదికపై ఆసీనులవుతారట. 28న సాయంత్రం 4-6గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమానికి 1200 మంది ప్రతినిధులు, 300 మంది పెట్టుబడిదారులు హాజరవుతున్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, భారీ పరిశ్రమల మంత్రి సురేశ్ ప్రభు, 36 దేశాల వాణిజ్య మంత్రులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
కేసీఆర్ స్వాగతోపన్యాసం
అమెరికా, భారత్ జాతీయ గీతాలతో ఈ సదస్సు ప్రారంభమవుతుంది. మనదేశంలో వెయ్యేళ్లుగా జరిగిన వినూత్న ఆవిష్కరణలు, దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పారిశ్రామిక వికాసం, మహిళా సాధికారితలపై దృశ్యరూప ప్రదర్శన నిర్వహిస్తారు. కాగా, సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం చేయనున్నారు. ఆ తర్వాత ఇవాంక, చివరగా ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని మోడీ హెచ్ఐసీసీ రెండో అంతస్తులోని లాంజ్కు వెళతారు. సదస్సుకు హాజరయ్యే వక్తల్లో కొందరితో విడివిడిగా భేటీ అవుతారు.
మోడీ ప్రత్యేక సమావేశాలు
సిస్కో సిస్టమ్స్ మాజీ సీఈఓ జాన్ థామస్ చాంబర్స్, కెనడా వ్యాపారవేత్త, ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు ప్రేమ్ వత్సా తదితరులతో ప్రధాని మాట్లాడే అవకాశాలున్నాయి. పారిశ్రామిక ప్రగతి, భారత్లో తయారీ, కొత్త ఆవిష్కరణలు, పారిశ్రామిక రంగంలో మహిళలు, ఇతర వర్గాల అభ్యున్నతి, సరళతర వ్యాపార నిర్వహణ, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధిపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటారు.
ఫలక్నుమాలో భారత ప్రభుత్వ విందు
అనంతరం ప్రధాని, ముఖ్యమంత్రి, ఇవాంకలతోపాటు 300 మంది పెట్టుబడిదారులు ఫలక్నుమా ప్యాలెస్లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే విందులో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రధాని ఢిల్లీకి పయనమవుతారు. ఇవాంకా అమెరికాకు వెళ్లపోతారని తెలిసింది. కొత్తగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించిన వారిని మాత్రమే సదస్సుకు ఆహ్వానించారు. రెండోరోజు తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్.. పారిశ్రామిక రంగం, మహిళా సాధికారతపై ప్రసంగిస్తారు. ప్రతినిధులకు సాయంత్రం గోల్కొండ కోటలో విందు ఉంటుంది.
ఇవాంకా ట్రంప్-యాచకురాలు అంజలి: కన్నీటిగాథకు చలించిన కవిత
ఇవాంకా ఇలా చెప్పారట..
ఇది ఇలావుండగా, శిఖరాగ్ర సదస్సుకు వస్తున్న ఇవాంక అమెరికా అధ్యక్షుని సలహాదారు హోదాలో ఉన్నందున అత్యంత ప్రముఖురాలిగా స్వాగతం పలికేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. అయితే తనకు స్వాగతం చెప్పేందుకు ఎవరూ అవసరం లేదని ఇవాంక సూచించారు. ఈ సమాచారాన్ని అమెరికన్ కాన్సులేట్ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేశారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా వివిధ నగరాలతోపాటిపడి హైదరాబాద్ ఈ సదస్సు నిర్వహణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇవాంక రాక సందర్భంగా నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆమె పర్యటించే ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.